● రామగుండం సీపీ అంబర్ కిశోర్ఝా
గోదావరిఖని: నిబంధనలు విస్మరించి రాకపోకలు సాగిస్తున్న బొగ్గు లారీలపై చర్య తీసుకోవాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ఆదేశించారు. తన కార్యాలయంలో బుధవారం జరిగిన శాంతిభద్రతలు, ట్రాఫిక్, రవాణాశాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. రోడ్డు ప్రమాదాల నివారణతోపాటు ప్రజల సురక్షిత ప్రయాణమే ప్రధాన లక్ష్యంగా రోడ్డు భద్రతా నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. ఇసుక, బొగ్గు(కోల్), యాష్ తదితర రవాణా వాహనాలు టార్పాలిన్ కవర్లతో కప్పి తరలించాలని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించని వాహన యజమానులు, డ్రైవర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరిమితికి మించి విద్యార్థులను తరలించే ఆటోలు, వాహనాపైనా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో సహాయం అందించే రహ్–వీర్ పథకంపై అవగాహన కల్పించాలని సూచించారు. రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, మంచిర్యాల డీటీవో గోపీకృష్ణ, రామగుండం, పెద్దపల్లి, మంచిర్యాల ట్రాఫిక్ సీఐలు రాజేశ్వరరావు, శ్రీనివాస్, హనన్, మంచిర్యాల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు.
పెట్టుబడుల్లో మోసాలపై అప్రమత్తం
ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్పై అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ జా సూచించారు. స్థానిక ఇల్లెందు క్లబ్లో ‘సింగరేణి హెచ్వోడీలు, అధికారులకు సురక్షా తిరంగా – సైబర్ స్వతంత్ర తెలంగాణ’పై అవగాహన కల్పించారు. తొలుత ప్రచార పోస్టర్ విడుదల చేశారు. సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి, సింగరేణి ఆర్జీ–1 జీఎం లలిత్కుమార్, సైబర్క్రైం, గోదావరిఖని ఏసీపీలు రంగారెడ్డి, రమేశ్, గోదావరిఖని వన్టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్జల్, రామగుండం సైబర్క్రైం సీఐ శ్రీనివాస్, రాణాప్రతాప్, ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


