● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిని బుధవారం ఆయన తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని కలెక్టర్ సూచించారు. హైరిస్క్ గర్భిణులను గుర్తించి నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. మందులు, పరీక్షలు సకాలంలో అందించాలని శ్రీహర్ష అన్నారు.
రక్షణ కల్పించాలి
జిల్లాలోని ప్రతీచిన్నారికి భద్రత, విద్య, సంరక్షణ సేవలు అందించాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో బాలల సంరక్షణ పథకం అమలుపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. అనాథలను గుర్తించాలని, దివ్యాంగులు, మానసిక వైకల్యం కలిగిన పిల్లలకు సదుపాయాలు కల్పించాలని చెప్పారు. ఆరునుంచి పదో తరగతి వరకు చదువు మానేసిన పిల్లలను గుర్తించి బడిలో చేర్పించాలని సూచించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారిని ఏటీసీల్లో చేర్పిస్తే ఉపాధి కల్పించే అవకాశం ఉందని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు.
లక్ష్య సాధనకు సమష్టిగా పనిచేయాలి
‘ప్రతీచుక్క నీటితో అధిక పంట’ లక్ష్య సాధనకు అన్నిశాఖలు సమష్టిగా పనిచేసి ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనను సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్లో నిర్వహించగా ఆయన మాట్లాడారు. డీఆర్డీవో కాళిందిని, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాస్, డీసీవో శ్రీమాల, ఆర్డీవో మంథని సురేశ్ తదితరులు పాల్గొన్నారు.


