ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధర్మారంలోని వడ్డెరకాలనీకి చెందిన బత్తిని సంతోష్(18) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. గతనెల 30న ఇదే కాలనీకి చెందిన బత్తిని అజయ్, దేవరాజ్తోపాటు సంతోష్ కారులో కరీంనగర్ నుంచి ధర్మారం వస్తుండగా అదపు తప్పి ఎర్రగుంటపల్లి గ్రామ శివారులోని చెట్టును ఢీకొంది. ఈ సంఘటనలో సంతోష్ తీవ్రంగా గాయపడగా అజయ్, దేవరాజ్ సైతం గాయపడ్డారు. వీరిని కరీంనగర్లోని ఆస్పత్రికి తరలించగా అజయ్, దేవరాజ్ కోలుకున్నారు. సంతోష్ చికిత్స పొందుతూ మరణించాడు.
విషాదంలో కుటుంబం..
వడ్డెరకాలనీకి చెందిన బత్తిని మల్లయ్య– మల్లేశ్వరికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు సంతానం. కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో పెద్దకుమారుడు హరీశ్ వారం రోజుల క్రితమే ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. విదేశాల్లో స్థిరపడుతూ కుటుంబానికి అండగా నిలవాలనే పెద్దకుమారిడిపై ఆశలు పెట్టుకున్న ఆ కుటుంబానికి.. ఇక్కడ ఉన్న చిన్న కుమారుడు సంతోష్ ప్రమాదంలో మృతి చెందడం తీరని విషాదాన్ని మిగిల్చింది. ఒక కుమారుడు విదేశాల్లో ఉండగా, మరొక కుమారుడు శాశ్వతంగా దూరం కావడంతో మల్లయ్య, మల్లేశ్వరి దంపతులు కన్నీరుమున్నీరవున్నారు. తమ్ముడి మరణవార్త తెలియడంతో హరీశ్ దుబాయ్ నుంచి వచ్చే ప్రయత్నంచేస్తున్నట్లు సమాచారం.


