గోదావరిఖని: ఓవర్లోడ్తో వెళ్తున్న బొగ్గులారీలు ప్రజల పాలిట ప్రాణాంతకంగా మారుతున్నాయి. సీహెచ్పీలు, ఇతర ప్రాంతాల నుంచి నిత్యం వందలాది లారీలు బొగ్గు రవాణా చేస్తున్నాయి. కనీస నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తున్నాయి.
నిబంధనలు అతిక్రమణ..
సింగరేణి బొగ్గును రవాణా చేస్తున్న లారీలు కనీస నిబంధనలు పాటించడం లేదు. పలు పరిశ్రమలు, ఇతర ప్రాంతాలకు నిత్యం వందలాది లారీలు రోడ్డు మార్గం ద్వారా బొగ్గు తరలిస్తున్నాయి. ఓసీపీ–1, 2, 3తోపాటు భూగర్భ గనుల నుంచి రాష్ట్ర రాజధాని, కంపెనీలకు బొగ్గు రవాణా చేస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్డువెంట వెళ్లే ద్విచక్రవాహనదారులు, ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా వ్యవహరించాల్సి ఉంది. కానీ, కొందరు డ్రైవర్లు నిబంధనలేవీ పాటించడంలేదు.
నిర్లక్ష్యంలో అధికారులు..
ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు, రోడ్డు ట్రాన్స్పోర్టు అథారిటీ అధికారులు(ఆర్టీఏ) నిబంధనల అమలు గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్దబొగ్గు పెళ్లలతో ఓవర్లోడ్తో ప్రమాదకరంగా రవాణా చేస్తున్నా.. డ్రైవర్లును నిలువరించలేకపోతున్నారు. స్పీడ్ బ్రేకర్ల వద్ద భారీగా బొగ్గు రోడ్డుపై పడిపోతోంది. ఇదేసమయంలో రోడ్డు పక్కన, వెనకాల వెళ్తున్న వాహనదారులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుంటున్నారు. ఓవర్లోడ్.. ఆపై పెద్దబొగ్గు పెళ్లలతో లారీ నంబర్ కూడా కనిపించకుండా డ్రైవర్లు డ్రైవింగ్ చేస్తున్నారు.
కనిపించని టార్పాలిన్లు
బొగ్గు రవాణా చేస్తున్న సమయంలో రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు, వాహనదారులకు ఇబ్బంది కలుగకుండా ఆర్టీఏ, పోలీసు అధికారులు తప్పనిసరిగా టార్పాలిన్ కప్పాలని నిబంధన విధించారు. చాలాలారీలు ఇలాంటి నిబంధనలు బేఖాతరు చేస్తున్నాయి. తద్వారా వెనకాల, రోడ్డువెంట వెళ్తున్నవారు ప్రమాదాలకు గురవుతున్నారు.


