మంథని: మంథని ప్రాంతంలో ప్రధానమైన పరిశ్రమలు ఏర్పాటు చేస్తూ ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుతామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. ఇందులో భాగంగానే కోక్ కంపెనీ ప్రతినిధులను సంప్రదించినట్లు చెప్పారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోక్ సంస్థ ప్రతినిధులతో సోమవారం సమావేశమయ్యారు. అనంతరం రామగిరి మండలం రత్నాపూర్లో పరిశ్రమల ఏర్పాటుకు ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించారు. హిందుస్తాన్ కోకాకోలా బెవరేజ్ సంస్థ సీఎస్ఆర్ నిధులతో మంథని బొక్కలవాగు చెక్డ్యాం ఆధునికీకరణకు రూ.2కోట్లు వెచ్చించిందన్నారు.
అభివృద్ధి, పెట్టుబడులకు ప్రోత్సాహం
మంథని/రామగిరి: అభివృద్ధి పనులు నాణ్యతతో నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. మంథని, రామగిరి మండలాల్లో పలు అభివృద్ధి పనుల పరిశీలన, ప్రారంభోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ‘మన ఊరు–మన కోచింగ్ సెంటర్’ ప్రారంభిస్తూ మాట్లాడారు. కోచింగ్ సెంటర్లో ఉచితంగా శిక్షణ, పుస్తకాలు, వసతి, భోజన సౌకర్యాలు అందిస్తున్నామని తెలిపారు. పరిశ్రమలకు విద్యుత్, నీరు, రోడ్లు వంటి వసతులను ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు ఆకర్షించి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష, కోక్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ అవినాష్, ప్రతినిధులు ముకుంద్, హిమాన్ష్, ఆర్డీవో సురేశ్, తహసీల్దార్లు ఆరిఫ్ ఉద్దీన్, సుమన్, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ సయేందర్రెడ్డి, కమిషనర్ మనోహర్, విద్యుత్ నియంత్రణ మండలి సలహా కమిటీ సభ్యుడు శశిభూషణ్ కాచే, రామగిరి ఎంపీడీవో శైలజారాణి, ఎంపీవో సమ్మిరెడ్డి, సర్పంచ్ పల్లె ప్రతిమ తదితరులు పాల్గొన్నారు.


