● ప్రణాళికను రూపొందించాలని
ఆదేశించిన కలెక్టర్
విజయనగరం గంటస్తంభం: బేంబూ మిషన్ లో భాగంగా జిల్లాలో వెదురుసాగును పెంచేందుకు వారం రోజుల్లో కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. జిల్లాలో బేంబూ మిషన్ అమలుకు ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సభ్యులైన పార్వతీపురం ఐటీడీఏ పీఓ ఆర్.వైశాలి, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస పాణి, జిల్లా అటవీశాఖ అధికారి సోమసుందర్ తో, కలెక్టర్ తన చాంబర్ నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాలో వెదురు సాగు పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెదురు సాగు చేపట్టేందుకు అనుగుణమైన భూములను గుర్తించాలని ఆదేశించారు. అటవీ భూముల్లో ఖాళీ స్థలాలను, చెట్లను నరికివేసిన స్థలాలను, అదనంగా సాగు చేయదలచిన స్థలాలను గుర్తించి, వెదురు సాగు చేపట్టాలని సూచించారు. ఐటీడీఏ ద్వారా మెంటాడ, ఎస్.కోట మండలాల్లో, డీఆర్డీఏ ద్వారా మైదాన ప్రాంతాల్లో వెదురు సాగును ప్రోత్సహించనున్నట్లు చెప్పారు. సాగుకు ప్రణాళికను తయారు చేసి, ప్రతిపాదనలను ముందుగానే పీసీసీఎఫ్కు అనుమతికోసం పంపించాలని కలెక్టర్ సూచించారు.


