విజయనగరం టౌన్:
ఇండియా వన్ ఏటీఎం చోరీ కేసులో అనుమానితులందరినీ విచారణ చేస్తామని ఎస్పీ ఏఆర్.దామోదర్ స్పష్టం చేశారు. ఈ సంఘటన జరిగిన గంట్యాడ మండలం లక్కిడాం జంక్షన్ లో మంగళవారం రాత్రి చోరీ జరిగిన ఏటీఎం ప్రాంతాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. చోరీ జరిగిన తీరుతెన్నులను క్షుణ్ణంగా పరిశీలించి, 50 మందితో కూడిన 10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. త్వరలోనే కేసును ఛేదిస్తామన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఏటీఎంలోకి ప్రవేశించి ఏటీఎం తాడుతో బొలెరో వాహనానికి కట్టి కొంతదూరం లాక్కెళ్లినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ఏటీఎంలో రూ.లక్షా50వేలు నగదు ఉంటుందన్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే జిల్లా పోలీస్యంత్రాంగం అప్రమత్తమైందని, నేరస్థలాన్ని ఇప్పటికే క్లూస్ టీమ్ పరిశీలించిందని, ఆధారాలను శాసీ్త్రయ పద్ధతిలో సేకరించామన్నారు. నిందితులను త్వరగా గుర్తించి అరెస్టు చేయాలనే లక్ష్యంతో అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని చెప్పారు. అన్ని ప్రాంతాల్లో సీసీటీవీ పుటేజ్లు సేకరించామన్నారు. అవసరమైన చోట సాంకేతిక నిపుణుల సహకారంతో డిటిజల్ ఆధారాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. దర్యాప్తు అధికారులు ప్రతి చిన్న ఆధారాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా పరిశీలించాలని, జిల్లా సరిహద్దులతో పాటూ పొరుగు జిల్లాల పోలీసులతో సమన్వయం పెంచి నిందితుల కదలికలపై నిఘా ఉంటాలని, ఎమ్ఓ క్రిమినల్స్ను విచారణ చేయాలని ఆదేశించారు. ఏటీఎం కేంద్రాల భద్రత విషయంలో బ్యాంక్ యాజమాన్యాలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. నాణ్యమైన సీసీ టీవీ కెమెరాలు, అలారం వ్యవస్ధ, తగినంత లైటింగ్, భద్రతా సిబ్బందిని ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు, లేదా కార్యకలాపాలు గమనించిన వెంటనే సమీప పోలీసు స్టేషన్కు లేదా డయల్ 100/ 112కి సమాచారమందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసుశాఖ పూర్తిగా కట్టుబడి ఉందని, నేరాలకు పాల్పడే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గంట్యాడ ఎస్సై డి.సాయికృష్ణ, సీసీఎస్ సీఐ డీడీ.నాయుడు, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇండియా వన్ ఏటీఎం చోరీ స్ధలాన్ని
పరిశీలించిన ఎస్పీ


