● ఆర్డీఓ ఆర్ మాధురి
సీతానగరం: పార్వతీపురం మన్యంజిల్లాలో రేషన్ డిపోలద్వారా పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకులు నిర్దేశించిన గడువులోగా వినియోగదారులకు అందజేయాలని రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్.మాధురి అన్నారు. ఈ మేరకు సీతానగరం మండలంలోని లచ్చయ్యపేట గ్రామంలో రేషన్ షాపులో నిత్యావసర సరుకుల పంపిణీ ప్రక్రియను బుధవారం ఆమె అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా రేషన్ షాపులో ఈ–పోస్ యంత్రం పనితీరు, సరుకుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్లును ఆర్డీవో భౌతికంగా పరిశీలించారు. అనంతరం రేషన్కార్డు దారులతో ముఖాముఖి మాట్లాడి సరుకుల సరఫరావిధానం, తూకాలు, నాణ్యత, పంపిణీ వేళలపై అడిగి తెలుసుకున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందే సరుకుల పంపిణీలో ఎలాంటి అక్రమాలులేదా అలసత్వం జరిగినా సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రతి లబ్ధిదారుకు సకాలంలో, నిర్దేశిత పరిమాణంలో సరుకులు అందేలా చూడాలని డీలర్లు పారదర్శకంగా వ్యవహరించాలని ఆదేశించారు. తూకంలో తేడాలు వచ్చినా కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ కె.ప్రసన్నకుమార్, డీటీలు ఉమామహేశ్వరరావు, పైడిరాజు, ఆర్ఐ శ్రీనివాసరావు, వీఆర్వోలు పాల్గొన్నారు.
పట్టాదార్ పాస్పుస్తకాల పంపిణీ
రీసర్వే పూర్తి చేసిన గ్రామాల్లో రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్.మాధురి బుధవారం పంపిణీ చేశారు. మండలంలోని లచ్చయ్యపేట సచి వాలయం పరిధిలో రీసర్వే పనులుపూర్తి చేసిన గ్రామాల్లో తప్పులులేని పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం రీసర్వే ప్రక్రియను ముమ్మరం చేసిందన్నారు. పట్టాదార్ పుస్తకాల్లో ఎక్కించవలసిన నంబర్లున్న ఆయా భూములకు సంబంధించిన లిఖిత పూర్వకంగా దఖలు పడిన రికార్డులతో తమదృష్టికి తేవాలన్నారు.అనంతరం గ్రామంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సుగర్ఫ్యాక్టరీలో ఉన్న బియ్యంగోదాంల నుంచి సుంకి పురుగుల వల్ల ఇబ్బందులు పడుతున్నామని, కాలువల సమస్యలున్నాయని కాలువలు, తాగునీరు, సుంకిఉరుగులునివారణకు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు ఆర్డీఓ ఆర్ మాధురి దృష్టికి తెచ్చారు.కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సంతోష్కుమార్ పాల్లొన్నారు.


