పార్వతీపురం రూరల్ : విద్యుత్ ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఏపీఈపీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా వ్యాప్తంగా విస్తృత అవగాహన ర్యాలీలు నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పార్వతీపురం, పాలకొండ, సాలూరు పట్టణాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాలను ఎస్ఈ పి.త్రినాథరావు ప్రారంభించారు. ప్రజలు, ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు, వీధి వ్యాపారులు ముందస్తు భద్రతా జాగ్రత్తలు పాటించి ప్రమాదాలను అరికట్టాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఇళ్ల నిర్మాణ సమయంలో విద్యుత్ లైన్లకు కనీసం 1.5 మీటర్ల దూరం ఉండేలా జాగ్రత్త పడాలని ఎస్ఈ సూచించారు. భవనాలపైకి ఇనుప రాడ్లు, పరంజా సామగ్రి తీసుకెళ్లే సమయంలో విద్యుత్ శాఖ అధికారుల అనుమతితో లైన్ క్లియరెన్స్ పొందాకే పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఇటీవల దుకాణాలకు ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టే క్రమంలో లైన్ల స్పర్శ వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, అవగాహన లోపమే దీనికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఇళ్లలో నాణ్యమైన పరికరాలనే వినియోగించాలని, తడి బట్టలు లేదా తడి చేతులతో స్విచ్లను తాకరాదని కోరారు.
కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, ఇంజినీర్లు, సిబ్బంది ప్లకార్డులతో వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు.


