మక్కువ: అసంక్రమిత వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు నిర్వహిస్తున్న ఎన్సీడీ సర్వేను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా ఆర్బీఎస్కే అధికారి డాక్టర్ టి.జగన్మోహనరావు సూచించారు. మండలంలోని శంబర, మక్కువ ప్రాంతాల్లోని పీహెచ్సీ(ప్రాథమిక ఆరోగ్య కేంద్రం)ల్లో వైద్యారోగ్య సిబ్బందితో మంగళవారం సమావేశమైన ఆయన..వైద్యసేవలు, ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. 4డీ లక్షణాల గుర్తింపు లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ఆర్బీఎస్కే 2.0 స్క్రీనింగ్ పక్కాగా చేపట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో గుండె జబ్బు, కేన్సర్, మధుమేహం వంటి అసంక్రమిత వ్యాధులతో బాధపడే వారిని గుర్తించి, తగిన చికిత్స, వైద్య సలహాలు అందేలా చూడాలన్నారు. సంచార చికిత్స శిబిరాలతో పాటు గ్రామగ్రామాన వైద్య శిబిరాలు నిర్వహించి, ప్రజలకు అవసరమైన వైద్యసేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు ఎల్.శివాజీనాయుడు, ఆర్.చంద్రశేఖర్, బి.ఫణీంద్ర, సీహెచ్వో సరోజిని తదితరులు పాల్గొన్నారు.


