విజయనగరం గంటస్తంభం: భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రచార వేదికగా మార్చిందని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ విమర్శించారు. రైతుల భూములతో నిర్మించిన విమానాశ్రయానికి విజయనగరం జిల్లా పేరు పెట్టకుండా విశాఖపట్నం పేరు పెట్టడం అన్యాయమన్నారు. నిర్వాసిత రైతులకు పూర్తి పరిహారం, పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలు ఇప్పటికీ కల్పించలేదని ఆరోపించారు. ప్రారంభోత్సవానికి అధికార యంత్రాంగాన్ని వినియోగించి భారీగా ప్రజాధనం ఖర్చు చేయడం అధికార దుర్వినియోగమన్నారు. ఉపాధి కల్పన, స్ధానిక యువతకు ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళిక వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో ప్రజలను తప్పుదారి పట్టించడం మానుకోవాలని సూచించారు. సమావేశంలో సీపీఎం నాయకులు రెడ్డి శంకరరావు, టీవీ రమణ పాల్గొన్నారు.


