విజయనగరం అర్బన్: విశాఖపట్నంలో ఏఐ రంగం అగ్రశ్రేణి నిపుణులతో ఆదివారం జరిగిన ‘ఏఐ ఫ్యూజన్ వైజాగ్’ అనే సదస్సులో సీతం కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు నాయకత్వంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని ప్రతిభ చూపారు. మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, టీసీఎస్, బోష్, జేపీ మార్గాన్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలకు చెందిన సీనియర్ సాంకేతిక నిపుణులు ఈ సదస్సులో పాల్గొని, కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో వస్తున్న మార్పులు, జనరేటివ్ ఏఐ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, భవిష్యత్ ఉద్యోగావకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పరిశ్రమ నిపుణులతో నేరుగా మాట్లాడే ఇటువంటి అవకాశాలు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచి భవిష్యత్ సాంకేతిక సవాళ్లకు వారిని సిద్ధం చేస్తాయని డాక్టర్ శశిభూణరావు తెలిపారు. ప్రపంచ స్థాయి అనుభవాన్ని విద్యార్థులకు అందించడమే తమ సంస్థల లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం ప్రతిభ చూపిన సీతం కళాశాల బృందానికి నిర్వాహకులు జ్జాపికలను అందజేశారు.


