విజయనగరం అర్బన్: విశాఖపట్నం ఆంధ్రయూనివర్సిటీలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘ఇస్ట్రో అకాడెమియా కనెక్ట్’ ఒకరోజు సదస్సులో సీతం ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలు అంతరిక్ష సాంకేతికత, ఉపగ్రహ పరిశోధనలు, విద్యార్థులకు ఇంటర్న్షిప్, ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. ప్రయోగ వాహనాలు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి రంగాల్లో విద్యా సంస్థలకు ఇస్రో పూర్తి సహకారం అందిస్తుందని ఇస్రో సైంటిఫిక్ సెక్రటరీ ఎం.గణేష్ పిళ్లై పేర్కొన్నారు. ఈ సదస్సులో పొందిన విజ్ఞానాన్ని ప్రత్యేక వీక్షణ కార్యక్రమాలతో విద్యార్థులతో పంచుకుంటామని అధ్యాపకులు తెలిపారు. జాతీయ స్థాయి పరిశోధనల్లో విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు కళాశాల కృషి చేస్తోందని సీతం డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు పేర్కొంటూ పాల్గొన్న అధ్యాపకులను అభినందించారు.


