న్యూస్రీల్
అరకొరగా
వైద్యం
ఇంట్లో ముగ్గురమూ జ్వరాల బారిన పడ్డాం. ఇప్పుడు మా పాప రాజేశ్వరికి బాగాలేదు. డోకిశీల ఆస్పత్రికి తీసుకెళ్తే మందులు ఇచ్చి పంపేశారు. తగ్గడం లేదు. కనీసం పరీక్షలు కూడా చేయడం లేదు. పార్వతీపురంలోని ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాం. పరీక్షలు చేసి మలేరియా అన్నారు. రూ.10 వేల వరకూ ఖర్చు అయ్యింది. అప్పు చేశాం.
– చిరంజీవి, కొత్తవలస గ్రామం
మా ఇంట్లో నాకు, మా ఆయన కు, బాబుకు కూడా జ్వరాలే. నెల రోజులుగా గ్రామంలో ఇదే పరిస్థితి. ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం కోసం రూ.5 వేల వరకూ ఖర్చు చేశాం. ప్రభుత్వాస్పత్రికి వెళ్లినా తగ్గడం లేదు.
– స్వాతి, కొత్తవలస గ్రామం
సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్ :
జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. జ్వర తీవ్రతతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ అధికమవుతోంది. జిల్లాలోని మూడు ఏరియా ఆస్పత్రులు, మూడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా ఆస్పత్రిలో సగటున రోజుకు 2 వేలకుపైగా ఓపీ నమోదవుతోంది. ఇందులో సగం మంది వరకు జ్వరం లక్షణాలతో ఉన్నవారే ఉంటున్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు సక్రమంగా అందకపోవడంతో ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అక్కడ వేల రూపాయలు ఖర్చు కావడంతో పేద గిరిజన వర్గాలు లబోదిబోమంటున్నాయి. ఇంటిల్లిపాదీ జ్వరాల బారిన పడడంతో వైద్యానికి తీసుకెళ్లే దిక్కు కూడా గిరిజన ప్రాంతాల్లో ఉండడం లేదు. రోగుల సంఖ్య పెరగడంతో ఆస్పత్రుల్లో పడకలు కూడా చాలడం లేదు. ఒక్కో బెడ్మీద ఇద్దరు, ముగ్గురు చొప్పున చికిత్స పొందుతున్నారు.
మలేరియా కేసులే అధికం
ఈ ఏడాది ఐదారునెలల్లోనే మన్యంలో 700 పైబడి మలేరియా కేసులు నమోదైనట్టు వైద్య రికార్డులు చెబుతున్నాయి. వాస్తవానికి మలేరియా, టైఫాయిడ్, వైరల్ జ్వరాల బారిన పడిన వారి సంఖ్య వేలల్లో ఉంది. జూన్ నుంచి ఆగస్టు వరకూ మలేరియా కేసులు ఏటా ఎక్కువగా నమోదవుతుంటాయి. దీనికి సంబంధించి ముందస్తు చర్యలను వైద్యశాఖ చేపట్టలేదు. చాలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మలేరియా కేసులకు కూడా సాధారణ పారాసిటమాల్ టాబ్లెట్, ఇంజక్షన్లు ఇచ్చి సరిపెడుతున్నారు. ఎన్ని రోజులు మందులు వాడినా తగ్గకపోవడంతో రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.
●కొద్ది రోజులుగా వాతావరణం మారింది. చిరు జల్లులు, పరిసరాల్లో నిల్వ నీరు, బురద, తాగునీటి కాలుష్యం వంటి కారణాలతో వైరల్ జ్వరాలు, మలేరియా, డయేరియా వంటివి వ్యాప్తి చెందుతున్నాయి.
ఇంటికి ఇద్దరు, ముగ్గురు జ్వర పీడితులు
పార్వతీపురం మండలం డోకిశీల పంచాయతీ కొత్తవలస గ్రామంలో కొద్ది రోజులుగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇంటికి ఇద్దరు, ముగ్గురు చొప్పున జ్వర పీడితులు ఉన్నారు. తల్లిదండ్రులు, పిల్లలు కూడా రోగాల బారిన పడడంతో ఇంట్లో గంజి కాచే దిక్కు కూడా ఉండడం లేదని గిరిజనులు అంటున్నారు. డోకిశీల పీహెచ్సీకి వెళ్తే.. సాధారణ జ్వరం మాత్రలు ఇచ్చి పంపుతున్నారని, కనీసం పరీక్షలు కూడా చేయడం లేదని వాపోతున్నారు. గ్రామంలో జ్వరాల తీవ్రత అధికంగా ఉందని, వైద్య శిబిరం నిర్వహించాలని కోరితే.. ఏఎన్ఎం, ఆశలను పంపించి.. బ్యానర్ పెట్టి, సాధారణ మందులు ఇచ్చి మమ అనిపించేశారని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పి.రాము తెలిపారు. చేసేది లేక, ఆటోకు రూ.వెయ్యి చొప్పున ఇచ్చి, పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రిని రోగులు ఆశ్రయిస్తున్నారని.. అక్కడ వైద్యానికే వేలాది రూపాయలు ఖర్చు అవుతోందని చెప్పారు.
గుమ్మలక్ష్మీపురం మండలం లుంబేసు పంచాయతీ
దేరుగండ గ్రామానికి చెందిన తోయక ఈశ్వరరావు, సుజాత దంపతుల కుమారుడు వరుణ్(10) ఇదే మండలంలోని
టిక్కబాయి గ్రామంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. ఇటీవల మలేరియా బారిన పడ్డాడు. మందులు వాడినప్పటికీ ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు.
సాలూరు మండలం ఎగువమెండంగిలో ఇటీవల
అనారోగ్యంతో గిరిజన బాలుడు మృతి చెందారు.
వైద్యాధికారులు గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించారు. 75 మందికి పరీక్షలు చేయగా.. ఆరుగురికి మలేరియా ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 14 ఏళ్లలోపు వారే ఐదుగురు ఉన్నారు.


