పార్వతీపురం రూరల్: మద్యం మత్తు ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. తీవ్ర మద్యం మత్తులో గడ్డి మందు తాగిన ఓ రైతు మృతిచెందాడు. ఈ ఘటన జియ్యమ్మవలస మండలం కుందర తిరువాడ గ్రామంలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన అక్కిన సీతారామనాయుడు (55) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు రోజూ మద్యం తాగే అలవాటు ఉంది. ఈ క్రమంలోనే పొలంలో కలుపు నివారణకు గడ్డి మందు పిచికారీ చేయడానికి వెళ్లాడు. మద్యం మత్తులో ఉన్న ఆయన.. పొలంలో మందు కొడుతూనే ప్రమాదవశాత్తు ఆ గడ్డి మందునే సగం వరకు తాగేశాడు.గమనించిన కుటుంబసభ్యులు వెంటనే జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు.
శ్రీకాకుళం రూరల్: బొల్లినేని మెడిస్కిల్స్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని హెచ్పీసీఎల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ నేతృత్వంలో ఫ్రంట్లైన్ హెల్త్కేర్ గివింగ్ అసిస్టెంట్, వెల్నెస్ థెరపిస్ట్ కోర్సులో ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పాసై 18 నుంచి 27 ఏళ్లలోపు యువతీ యువకులు అర్హులని పేర్కొన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఇంటర్ పాసైన విద్యార్థులకు డిప్లమో, బీఎస్సీ, ఎంఎల్టీ, బీపీటీ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయని, మరిన్ని వివరాలకు 7995013422, 7680945357 నంబర్లను సంప్రదించాలని కోరారు.
పార్వతీపురం రూరల్: కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న ‘స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ (ఎస్ఐహెచ్ఎం)’లో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తున్నట్లు అడ్మిషన్న్స్ ఇన్చార్జి కె.శివరామకృష్ణ సోమవారం తెలిపారు. ఇంటర్ అర్హతతో మూడేళ్ల బీఎస్సీ (హెచ్ అండ్ హెచ్ఏ) డిగ్రీ కోర్సు, టెన్త్ అర్హతతో ఏడాది వ్యవధి గల క్రాఫ్ట్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్, ఐదు నెలల వ్యవధి గల సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ కోర్సులకు ఎలాంటి వయో పరిమితి లేదు. అభ్యర్థులకు తరగతులతో పాటు ప్రముఖ ఫైవ్స్టార్ హోటళ్లలో ప్రాక్టికల్ శిక్షణ ఇస్తారు. కోర్సు పూర్తి చేసిన వారికి ఏపీ పర్యాటక శాఖ, ఇతర ఫైవ్స్టార్ హోటళ్లలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. విద్యార్థులకు బ్యాంకు రుణ సదుపాయం, బాలబాలికలకు వేర్వేరు హాస్టల్ వసతులు ఉన్నాయి. ఆసక్తి గలవారు దరఖాస్తులను ఆగస్టు 4లోగా కళాశాలకు పంపాలి. ఇతర వివరాలకు ఫోన్ 97013 43846, 91005 58006, 97004 40604 నంబర్లలో లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్ఐహెచ్ఎమ్టీపీటీ.ఓఆర్జీ వెబ్సైట్ను సంప్రదించవచ్చని సూచించారు.
రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని మృతదేహం
విజయనగరం క్రైమ్: అలమండ రైల్వేయార్డ్ దిగువ ఉన్న రైల్వే ట్రాక్పై ఎలక్ట్రికల్ పోల్ వద్ద గుర్తు తెలియని మృతదేహాం పడి ఉండడాన్ని విజయనగరం జీఆర్పీ సిబ్బంది సోమవారం కనుగొన్నారు. మృతుని వయస్సు సుమారు 35నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని జీఆర్పీ హెచ్.సీ అశోక్ తెలిపారు. మృతుడు 5 అడుగుల 6 అంగుళాల పొడవు, చామనఛాయ రంగులో చింపిరి గెడ్డం కలిగి ఉన్నాడని, శరీరంపై బిస్కెట్ రంగు లోయర్, స్లీల్ లెస్ రౌండ్ నెక్ నలుపు రంగు గల బనియన్ దానిపై బుల్స్ 23 అను ఇంగ్లీష్ అక్షరాలు ఉన్నాయన్నారు. మెడలో తెలుపు ఆకు పచ్చ ఎరుపు రంగు గల దారంతో ఉన్న తాడు ధరించి ఉన్నాడని మృతదేహాన్ని గుర్తించిన గలిగిన వారు ఫోన్ 6301365605, 9192475 85742 నంబర్లకు తెలియజేయాలని హెచ్సీ అశోక్ కోరారు.


