● పరిహారం చెల్లించాలని రైతుల ఆందోళన
కొత్తవలస: మండలంలోని బలిఘట్టం గ్రామం సమీపంలో ఎంఎస్ఎంఈ పార్కులో పనులకు పరిహారం అందించలేదంటూ రైతులు ఆది వారం పనులను అడ్డుకుని ఆందోళన చేశారు. ఈ పార్కు నిర్మాణానికి గతంలో ప్రభుత్వం భూ సేకరణ నిర్వహించింది. సేకరించిన భూమికి సంబంధించి రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం అందించలేదు. గత ఏడాది సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అట్టహాసంగా ఎంఎస్ఎంఈ పార్కు పనులకు శంకుస్థాపన చేశారు. కాగా పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఈ తరుణంలో బల్లిఘట్టం, అడ్డూరువానిపాలెం తదితర గ్రామాలకు చెందిన రైతులు సుమారు 20 మంది పార్కు వద్దకు చేరుకుని తమకు పూర్తిస్థాయిలో పరిహారం ప్రభుత్వం అందించలేదు. పనులను ఆపండి అంటూ అడ్డుకున్నారు. ఆదివారం కావడంతో అదికారులు అందుబాటులో లేకపోవడంతో పనులను నిలిపేశారు.


