బలిజిపేట: రైతులను ఉద్దరిస్తామంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం నిలువునా ముంచేసింది. ఉచిత పంటల బీమా పథకానికి మంగళం పాడేసింది. విపత్తుల సమయంలో సాయం అందకుండా చేసింది. ఇప్పుడు భీమా ప్రీమియం భారం రైతులపై పడింది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో వరి, మొక్కజొన్న పంటలు చేతికందే పరిస్థితులు కనిపించడంలేదు. కరువుకాలంలో పరిహారం అందాలంటే ప్రీమియం సొమ్ము రైతులు చెల్లించాలంటూ వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో కొందరు రైతులు అప్పులు చేసి ప్రీమియం డబ్బులు చెల్లిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి రైతులకు కష్టాలు మొదలయ్యాయని లబోదిబోమంటున్నారు. విత్తనం నుంచి ఎరువు వరకు, పరిహారం నుంచి పంట అమ్మకం వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కాలువలు అస్తవ్యస్తంగా ఉండడంతో సాగునీటి వెతలు తప్పడంలేదని వాపోతున్నారు.
అప్పట్లో రైతులకు భారం లేకుండా..
వ్యవసాయ రంగాన్ని, రైతులను ఆదుకునే దిశగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2019 ఖరీఫ్ సీజన్ నుంచి ఉచిత పంటల బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ–క్రాప్ నమోదు ప్రామాణికంగా ఉచిత పంటల బీమాను అమలు చేశారు. విపత్తుల సమయంలో సాగుసాయం అందేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
– పత్తి, అరటి పంటలకు ప్రీమియం చెల్లింపులకు జూలై 24తో గడువు ముగిసింది. బ్యాంకు నుంచి రుణం పొందిన రైతుల ప్రీమియం మొత్తాన్ని సంబంధిత నిబంధనల ప్రకారం బ్యాంకు నుంచి ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించబడుతుంది. బ్యాంకు రుణం లేని రైతులు ప్రీమియంను కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా చెల్లించి పంటల బీమా పొందవచ్చని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే వర్షాలు కురవక పంటలు పండుతాయా? లేదా? అనే సందిగ్దంలో ఉన్నాం. దుక్కులు, విత్తనాలు, నారు బతికించుకునేందుకు అధిక పెట్టుబడి అయ్యింది. ఇప్పుడు బీమా ప్రీమియం చెల్లించాలంటే మరింత భారమే. గతేడాది ప్రీమియం చెల్లించిన రైతులు పంటలు నష్టపోయిన సమయంలో పరిహారం కూడా అందలేదు.
– సత్యంనాయుడు, రైతు, బలిజిపేట
ఉచిత పంటల బీమాకు మంగళం
రైతన్నకు చంద్రబాబు ప్రభుత్వం శఠగోపం
ప్రీమియం రైతులే చెల్లించేలా ఉత్తర్వులు
ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో పంటల సాగుపై ఆందోళన
అప్పులు చేసి బీమా ప్రీమియం చెల్లిస్తున్న రైతులు


