సీతానగరం : జిల్లా ప్రజలకు దశాబ్ద కాలంగా ఆందోళనకు గురి చేస్తున్న ఏనుగుల తరలింపునకు సంబంధించి కుంకీ ఏనుగులు శనివారం వచ్చేశాయి. మండలంలోని అప్పయ్యపేట – జోగింపేట గ్రామాలను ఆనుకుని ఉన్న కొండపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏనుగుల సంరక్షణ కేంద్రానికి కుంకీ ఏనుగులు చేరుకున్నాయి. ఎనిమిది ఏనుగుల గుంపును కుంకీ ఏనుగులు మచ్చిక చేసుకుని తరువాత ఏనుగులు ఎక్కడ నుంచి వచ్చాయో అక్కడకు చేరేలా వీటి ద్వారా చర్యలు చేపట్టనున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు నుంచి వచ్చిన ఏను గులు జోగింపేట సంరక్షణ కేంద్రానికి చేరడంతో జిల్లా ప్రజలు, ముఖ్యంగా ఏజెన్సీ ప్రజలు ఏనుగుల బారి నుంచి ఇక ముప్పు తప్పుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కుంకీ ఏనుగులైన జయంతి, అభిమన్యులకు అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ పర్యవేక్షణలో మండల రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం జోగింపేట ఏనుగుల సంరక్షణ కేంద్రానికి చేరిన కుంకీ ఏనుగులకు చీఫ్ కన్జర్వేటరు ఆఫ్ పారెస్ట్స్ అధికారి ఐకేవీ రాజు, ఎమ్మెల్యే బి.విజయచంద్ర, డీఎఫ్ఓ జీఏపీ ప్రసూన, పలమనేరు, పాలకొండ సబ్ డీఎఫ్ఓలు పూజలు చేసి ఆశీర్వాదం చేసుకున్న అనంతరం వాటి స్థావరాల వద్ద సపర్యలు చేసి గొలుసులతో బంధించారు. ఈ ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ కె.ప్రసన్నకుమార్, ఎంపీడీఓ ఎంఎల్ఎన్ ప్రసాద్, ఎస్ఐ హేమలత, అటవీ శాఖ సెక్షన్ అధికారులు, ఫీల్డ్ సిబ్బంది, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


