సత్తెనపల్లి: అనకాపల్లి జిల్లాలో వెలుగు చూసిన కేసులో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తులు పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. అనకాపల్లి జిల్లాలో వాహనాల తనిఖీలో భాగంగా అనుమానాస్పదంగా వెళుతున్న కారును ఆపేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా అందులో ఉన్న వ్యక్తులు వాహనాన్ని అక్కడే వదిలిపెట్టి పరారయ్యారు. కారును పోలీసులు తనిఖీ చేయగా అందులో 200 కిలోల గంజాయి ప్యాకెట్లను గుర్తించారు. స్వాదీనం చేసుకున్నారు. అనంతరం చేపట్టిన దర్యాప్తులో సత్తెనపల్లి పట్టణంలోని సంగం బజార్కు చెందిన ఎస్కే ఫయాజ్, 27వ వార్డుకు చెందిన ఎస్కే రఫీలు నిందితులుగా ఉన్నట్లుగా గుర్తించి, వారిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరికొంతమంది పాత్రపై కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. పట్టణానికి చెందిన పది మందికిపైగా ఈ దందాకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ ముఖ్యనేత అండదండలతోనే ఈ గంజాయి అక్రమ రవాణాకు తెరతీశారనే విమర్శలు పట్టణంలో వినిపిస్తున్నాయి. మిగిలిన వారి కదలికలపైనా పోలీసులు నిఘా పెట్టారు. అయితే వీరంతా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య నేతకు కీలక అనుచరులుగా ఉండటం గమనార్హం.


