టైలరింగ్ శిక్షణ పేరుతో ఆర్భాటం ఉచితంగా కుట్టు మిషన్లు ఇస్తామంటూ గొప్పలు శిక్షణ ఇచ్చి చేతులు దులుపేసుకున్న ప్రభుత్వం ఏడాది దాటినా జిల్లాలోని మహిళలకు అందని వైనం మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు
సత్తెనపల్లి: మహిళలు స్వయం శక్తితో ఎదిగేందుకు కుట్టు శిక్షణ ఇచ్చి ఉచితంగా మిషన్లు ఇస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం ఆర్భాటం చేసింది. ఆ మాటలు నమ్మి వేలాది మంది మహిళలు ఎంతో ఆశతో శిక్షణ పొందారు. తీరా చూస్తే ప్రభుత్వం శిక్షణతో సరిపెట్టేసి కుట్టుమిషన్లు ఇవ్వకుండా చేతులు దులిపేసుకుంది. ఇదంతా చంద్రబాబు మార్కు కట్టు కథలా ఉందంటూ ప్రభుత్వ తీరుపై మహిళలు మండిపడుతున్నారు.
రెండు విడతలుగా...
బీసీ కార్పొరేషన్, ఈడబ్ల్యూఎస్ శాఖల ఆధ్వర్యాన బీసీ, ఆర్థికంగా వెనుకబడిన తరగతి (ఈబీసీ), కమ్మ, రెడ్డి, క్షత్రియ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, కాపు సామాజిక వర్గాల్లో అర్హులైన మహిళలకు 2024–25 కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గత ఏడాది ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చారు. దీనికోసం సెంటర్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (సీయూఆర్డీ), సోషల్ ఏజెన్సీ ఫర్ పీపుల్స్ ఎంపవర్మెంట్ (ఎస్ఏపీఈ) ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా 16 కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి కేంద్రంలో ఒక ట్రైనర్, ఒక కంప్యూటర్ ఆపరేటర్ను నియమించారు. శిక్షణ కేంద్రం అద్దె, కుట్టుమిషన్, ఇతర పరికరాల కోసం ఒక్కో మహిళకు సుమారు రూ. 22 వేలు చొప్పున కేటాయించారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోనూ మొదటి విడతగా 7,345 మంది మహిళలు తమ వివరాలు నమోదు చేసుకున్నారు. వీరిలో 30 శాతం మంది శిక్షణ పొందారు. నాలుగు నెలలకు తగ్గకుండా శిక్షణ పొందితేనే కుట్టు మిషీన్ ఇస్తామని ప్రకటించారు.
మిషన్లు ఇవ్వకుండా కాలయాపన...
నాలుగు నెలల శిక్షణ పూర్తి చేసుకున్న వెంటనే 75 శాతం హాజరు నమోదైన మహిళలకు సర్టిఫికెట్తో పాటు ఉచితంగా కుట్టుమిషన్లు అందిస్తామని అప్పట్లో ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. కానీ అలా జరగలేదు. పైగా 75 శా తం హాజరున్న మొదటి బ్యాచ్ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందిస్తామని చెప్పుకొచ్చారు. శిక్షణ పొందితే మిషన్లు ఇస్తారని ఆశతో ఎదురు చూస్తుంటే కాలయాపన చేస్తున్నారని మహిళలు మండిపడుతున్నారు. కేవలం మిష న్లు ఇవ్వకుండా కాలయాపన చేయడానికి ఇలా సాకులు చెబుతున్నారని మండిపడుతున్నారు. శిక్షణ పూర్తయి ఏడాది గడుస్తున్నా కుట్టు మిషన్లు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని, కనీసం ఎప్పుడు ఇస్తారో స్పష్టత ఇవ్వాలని నిలదీస్తున్నారు. దీంతో రెండో విడత శిక్షణ కూడా ఇవ్వలేదు. అలాగే శిక్షణ ఇచ్చిన 32మంది సిబ్బందికి సైతం ప్రభుత్వం వేతనాలు ఇవ్వకపోవడం గమనార్హం. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి శిక్షణ పొందిన మహిళలకు ఉచితంగా కుట్టు మిషీన్లు అందజేయడంతో పాటు శిక్షణ ఇచ్చిన సిబ్బందికి వేతనాలు విడుదల చేయా లని మహిళలు కోరుతున్నారు.


