ఈపూరు: ఆటో నడుపుతుండగా మార్గమధ్యలో గుండెపోటు వచ్చినప్పటికీ సమయస్ఫూర్తితో ఐదుగురు ప్రయాణికులను ప్రమాదం నుంచి తప్పించి ఓ ఆటో డ్రైవర్ మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. మండలంలోని ఊడిజర్ల గ్రామానికి చెందిన కాండ్రకొండ మధుకిరణ్ (42) ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తుంటాడు. ఎప్పటిలాగే ఈపూరు నుంచి వినుకొండకు ప్రయాణికులతో బయలుదేరాడు. కొచ్చర్ల గ్రామ సమీపంలోని చెరువు వద్ద రాగానే మధుకిరణ్కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆటోను రోడ్డు పక్కన నిలిపివేసి, అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు 108 కి సమాచారం ఇవ్వడంతో వైద్య సిబ్బంది సీపీఆర్ చేసి వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఎస్ఐ వేణుగోపాల్ సంఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు.
ప్రయాణికులను కాపాడి డ్రైవర్ మృతి


