మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
మేడికొండూరు: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి చెందిన మండల పరిధిలోని పేరేచర్లలో మంగళవారం చోటుచేసుకుంది. సీఐ మధుసూదన్ రావు తెలిపిన వివరాలు.. యూనివర్సల్ కళాశాలలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న భవాని శంకర్(20) తన బావమరిది నాగంజితో పేరేచర్లలోని ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఉంటూ కాలేజీకి వెళ్లి వస్తుంటాడు. ఈ క్రమంలో డోకిపర్రు గ్రామానికి చెందిన వినయ్ అదే కళాశాలలో చదువుతున్నాడు. ముగ్గురు కలసి పేరేచర్ల సమీపాన ఉన్న కై లాసగిరి క్షేత్రానికి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. గుంటూరు వైపు నుంచి వస్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి భవాని శంకర్ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో భవాని శంకర్ ఘటన స్థలంలోని మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన నాగంజి, వినయ్ని మేడికొండూరు పోలీసులు చికిత్స నిమిత్తం 108లో గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెనాలిరూరల్: పోలీసుల పేరిట స్కూటీపై వస్తున్న వృద్ధుడిని అడ్డగించి అతని బండిలో ఉన్న రూ.50 వేలు దోచుకున్న ఘటన తెనాలి– విజయవాడ రహదారిలో ఆటోనగర్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. కొల్లిపర మండలం తూములూరు గ్రామానికి చెందిన 73 ఏళ్ల మల్లికార్జునరెడ్డి తెనాలి మండలం నందివెలుగు గ్రామంలోని ఎస్బీఐ బ్యాంకులో రూ.1.60 లక్షలు విత్డ్రా చేశారు. నగదును స్కూటీ డిక్కీలో పెట్టుకుని తెనాలి వస్తుండగా ఆటోనగర్ వద్ద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించారు. పోలీసులం, తనిఖీ చేయాలంటూ వాహన పత్రాలను అడిగారు. అదే సమయంలో డిక్కీలో ఉన్న నగదులో నుంచి రూ. 50 వేలు తీసుకుని పరారయ్యారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ కె.ఆనంద్ తెలిపారు.
తెనాలిరూరల్: గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తెనాలి మండలం జగ్గడిగుంటపాలెంలో చోటుచేసుకుంది. ఎస్ఐ కె.ఆనంద్ అందించిన వివరాలు.. గ్రామ పరిధిలోని పొలంలో సుమారు 55 ఉండి 60 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తి సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని తెనాలి జిల్లా వైద్యశాల మార్చురీకి తరలించారు. మృతుడి ఆచూకీ తెలిస్తే 9440796219, 9440796170 నంబర్లలో సంప్రదించాలని రూరల్ ఎస్ఐ మంగళవారం కోరారు.


