రాయగడ : మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వలపై ఉక్కుపాదం మోపుతున్న ఝార్సుగుడ పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు చేపట్టిన తనిఖీల్లో సుజుకి ఎర్టిగా కారులో తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 61.280 కిలోల గంజాయిని పొలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఎస్పీ జీఆర్ రాఘవేంద్ర తెలియజేసిన వివరాల ప్రకరం ఆదివారం నాడు ఉదయం ఝార్సుగుడ పోలీస్ స్టేషన్కు అందిన విశ్వసనీయ సమాచారంతో చితువాపడ కూడలి సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన కారును గుర్తించారు. దీంతో వాహనంలో తనిఖీలు చేపట్టగా అందులో గంజాయి పట్టుబడింది. ఈ మేరకు కుందన్ సాహు అనే వ్యక్తిని అరెస్టు చేశారు.


