రణస్థలం: మండలంలోని నారువ పంచాయతీలో నిర్మాణంలో ఉన్న పరిశ్రమలో ఎయిర్ కండీషనర్ (ఏసీ)లకు వాడే చిన్నపాటి రాగి పైపులు దొంగలించిన కేసులో పట్టుబడినవారిని స్టేషన్ బెయిల్పై విడిచిపెట్టామని జేఆర్పురం సీఐ ఎం.అవతారం తెలిపారు. పైడిభీమవరం సిస్కో పోలీస్స్టేషన్లో ఈ కేసు విషయమై విలేకరుల సమావేశం బుధవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల 18వ తేదీన నారువ గ్రామానికి చెందిన నిద్రబంగి ప్రసాద్, నీలాపు పరదేశి(మహేష్), నిద్రబంగి దుర్గా ప్రసాద్లు పరిశ్రమలో దొంగతానికి పాల్పడ్డారు. దొంగిలించిన రాగి పైపుల 25 కట్టలను పూసపాటిరేగ మండలంలోని కామవరం దగ్గర ఒక తుక్కు దుకాణంలో అమ్మేందుకు ఆటోలో వెళ్లారు. అక్కడ అమ్మకానికి ప్రయత్నించగా జేఆర్పురం, పైడిభీమవరం పోలీసులు పట్టుకున్నారు. వాటి విలువ సుమారు రూ.8.25 లక్షలు ఉంటుందని తెలిపారు. వారిని అదుపులోకి తీసుకుని ప్రాపర్టీ రికవరీ చేశామన్నారు. అనంతరం స్టేషన్ బెయిల్పై ఇంటికి పంపించామని తెలిపారు. కాగా ఈ ముగ్గురి నిందితులకు స్టేషన్ బెయిల్ ఇవ్వడంపై పోలీసులపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు జేఆర్పురం ఎస్ఐ వి.సత్యనారాయణను వివరణ కోరగా 7 ఏళ్లలోపు కేసులకు రిమాండ్కు తరలించకుండా పంపించవచ్చునని, అదే 7 ఏళ్లు దాటిన కేసులకు తప్పకుండా రిమాండ్కు తరలిస్తామన్నారు.


