కొరాపుట్: డుడుమా జలపాతాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి సంపత్ స్వయ్ సందర్శించారు. గురువారం రాత్రి కొరాపుట్ జిల్లా లమ్తాపుట్ సమితి మాచ్ఖండ్ సమీపంలో ఉన్న జలపాతం తిలకించారు. ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో జలపాతం నూతన అందాలు సంతరించుకొంది. జలపాతం చూసి మంత్రి ఆశ్చర్యచకితులయ్యారు. అనంతరం అక్కడ పర్యాటకులకు అందుతున్న సౌకర్యాలు, ఏర్పాట్లు పరిశీలించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు అధికారులు వివరించారు. అనంతరం స్థానికులతో మంత్రి సమావేశమయ్యారు. కొరాపుట్ ఎంఎల్ఎ రఘురాం మచ్చో తదితరులు ఉన్నారు.
ఘనంగా వన మహోత్సవం
పర్లాకిమిడి: జిల్లాలో గుమ్మాబ్లాక్ పద్మపురం గ్రామంలోని బినోదిని సైన్స్ కళాశాలలో శనివారం వన మహోత్సవం 2.0 ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి మాట్లాడుతూ.. మొక్కలను నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతలు కూడా విద్యార్థులు తీసుకోవాలని సూచించారు. బినోదిని ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆయన కొన్ని మొక్కలను నాటారు. కార్యక్రమంలో సంబద్ సాహిత్య ఘోరో ఉపాధ్యక్షుడు బినోద్ జెన్నా, ప్రగతి మహిళా సంఘటన్ కార్యదర్శి తనూజా శతపతి, లోకనాథ మిశ్రా, కళాశాల ప్రిన్సిపాల్ మనోజ్ కుమార్ పట్నాయిక్ తదితరులు పాల్గొన్నారు.
పేదలకు నిత్యావసరాలు పంపిణీ
రాయగడ: స్థానిక రైతుల కాలనీలోని నవజీవన్ ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం నిరుపేదలైన ఆదివాసీ వృద్ధ మహిళలకు నిత్యావసరాల వస్తువులను పంపిణీ చేశారు. ట్రస్టు నిర్వాహకురాలు ఎం.నళిని వారికి బియ్యం, కందిపప్పు, ఉప్పు, నూనె, బంగాళ దుంపలు వంటి పలు రకాల నిత్యావసరాల వస్తువులను అందజేశారు. ప్రతీ నెలకొసారి ఈ తరహా నిత్యావసరాలను 40 మంది నిరుపేదలైన ఆదివాసీ వృద్ధులకు ట్రస్టు తరఫున పంపిణీ చేస్తున్నామని ఆమె తెలియజేశారు. అదేవిధంగా ట్రస్టు ద్వారా సుమారు వంద మంది నిరుపేదలైన ఆదివాసీ బాలికలను ఉచితంగా చదివించడంతో పాటు వారికి భోజన, వసతి సౌకర్యాలను కల్పిస్తున్నామని చెప్పారు. ట్రస్టు వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీధర్ ఆచార్య కొన్నాళ్లుగా ఇక్కడ ట్రస్టును ఏర్పాటు చేసి ఇటువంటి తరహా సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లు చెప్పారు.
ఎదురెదురుగా ఢీకొన్న
ఆర్టీసీ బస్సులు
కొరాపుట్: ఘాట్ రోడ్డులో ఓఎస్ ఆర్టీసీ బస్సులు ఎదురెదుగా ఢీకొన్నాయి. కొరాపుట్–జయపూర్ ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. నబరంగ్పూర్ జిల్లా ఇంద్రావతి నుంచి విశాఖపట్నం ఒక బస్సు వెళ్తుంది. బ్రహ్మపుర నుంచి బలిమెల మరొక బస్సు వస్తుంది. ఈ రెండు బస్సులు ఎదురెదురుగా వస్తున్నప్పుడు మధ్యలో మరో వాహనం వచ్చింది. ఆ వాహనాన్ని తప్పించే క్రమంలో బస్సులు ఢీకొన్నాయి. ఘటనలో బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


