కొరాపుట్: ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్ నుంచి ఒకేసారి 180 మంది విద్యార్థులు వీడడంపై సమగ్ర వివరాలు ప్రభుత్వం వెల్లడించాలని ప్రతి పక్ష బీజేడీకి చెందిన మాజీ ఎంపీ రమేష్ చంద్ర మజ్జి డిమాండ్ చేశారు. శనివారం నబరంగ్పూర్ జిల్లా జొరిగాం సమితి బొడ టెమర గ్రామ పంచాయతీ సన్న టెమర గ్రామంలో బీజేడీ బృందం పర్యటించింది. హాస్టల్ని సందర్శించింది. హాస్టల్లో ఉన్న విద్యార్థులతో రమేష్ మజ్జి సంభాషించారు. హాస్టల్లో గదుల పైభాగం నుంచి వర్షం నీరు రావడం గమనించారు. అనంతరం విద్యార్థులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. పరిశుభ్రత లోపం, మరుగుదొడ్ల దుస్థితిని పరిశీలించారు. అనంతరం గ్రామస్తులు కూడా విద్యార్థులు పడుతున్న కష్టాలను వివరించారు. రెండు గదులలో 180 మంది విద్యార్థులకు వసతి కల్పించడం పట్ల రమేష్ ఆశ్చర్య పోయారు. అనంతరం విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం సునిత దృష్టి సారించాలన్నారు. వారి కష్టాలను అడిగి తెలుసుకుని సమస్య పరిష్కరించాలన్నారు. జిల్లాలో ప్రతీ హాస్టల్లోనూ సమస్యలు ఉన్నాయన్నారు. జిల్లా పరిషత్ సభ్యులు, సర్పంచ్లు, సమితి చైర్మన్లు, సమితి సభ్యులు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.


