రాయగడ: జిల్లాలోని కొలనార సమితి వివల్కొన రెసిడెన్సియల్ పాఠశాలలో జరిగిన ర్యాగింగ్ ఘటన అత్యంత బాధాకరమైందని బిజు జనతాదళ్ పేర్కొంది. విద్యాలయాలు, వసతి గృహాల విద్యార్థులకు భద్రత, విద్య, సంస్కారాలను అందించే పవిత్రమైన ప్రదేశాలుగా ఉండాల్సిన సమయంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం విచారకరమని తెలిపింది. ఈ మేరకు వాస్తవాలు తెలుసుకునేందుకు బీజేడీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జగన్నాథ్ సరక నేతృత్వంలో ప్రతినిధుల బృందం పాఠశాలను సందర్శించింది. బాధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, హెచ్ఎంతో సమావేశమైంది. ఘటనకు సంబంధించిన అన్ని అంశాలపై వివరాలు తెలుసుకుంది. అనంతరం టీడీఏ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్తోపాటు జిల్లా సంక్షేమ శాఖ అధికారితో ఫోన్లో మాట్లాడారు. ఘటనపై తక్షణమే నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన ఒక్క పాఠశాలకు మాత్రమే పరిమితమైన సమస్య కాదన్నారు. రాష్ట్రంలోని అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థుల భద్రత, అవగాహన కార్యక్రమాలు, క్రమం తప్పని పర్యవేక్షణ, ర్యాగింగ్ నిరోధక వ్యవస్థలకు మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సరక డిమాండ్ చేశారు. ప్రతీ విద్యార్థి సురక్షిత వాతావరణంలో విద్యను అభ్యసిండం వారి మౌలిక హక్కు అని, పిల్లల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదన్నారు.


