న్యూస్రీల్
కూలిన వంతెన
సేవా పేపరుమిల్లు ట్రాన్స్ఫార్మర్లో భారీ దొంగతనం
భువనేశ్వర్:
రాష్ట్రంలో తలెత్తుతున్న వరద పరిస్థితి దృష్ట్యా వరద నివారణ మౌలిక సదుపాయాలను జలవనరులశాఖ పర్యవేక్షిస్తుంది. నదుల పరిసర ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి సన్నద్ధతను ముమ్మరం చేసింది. అధికారులు, సిబ్బంది అందరూ క్షేత్రస్థాయి కార్యకలాపాల్లో చురుకుగా నిమగ్నమై ఉన్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ, సత్వర స్పందన కోసం అదనపు అధికారులను మోహరించారు. ఆనకట్టలు, నదీ వ్యవస్థలు, ఇతర కీలక వరద నిర్వహణ నిర్మాణాలపై నిరంతరం నిఘా కార్యకలాపాల్లో సీనియర్ ఫీల్డ్ ఇంజినీర్లు నిమగ్నమయ్యారు. వరద ముప్పు సమస్యాత్మక ప్రాంతాలు కటక్, కేంద్రాపడా, జగత్సింగ్పూర్, పూరీ జిల్లాల్లోని మైనర్ ఇరిగేషన్, మెగా లిఫ్ట్ ఇరిగేషన్, క్వాలిటీ అస్యూరెన్స్, సర్వే–ఇన్వెస్టిగేషన్ విభాగాలకు చెందిన సూపరింటెండింగ్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు సహా ఫీల్డ్ ఇంజినీర్లను పూర్తి సన్నద్ధతతో వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహానది, బ్రాహ్మణి, బైతరణి బేసిన్ సిస్టమ్ (ఎంబీబీఎస్) చీఫ్ ఇంజినీర్, ఆలీ బ్లాక్లోని గోవింద్పూర్ వద్ద మహాదేవ్ ఆలయం సమీపంలో ఉన్న ఖొరసుంవాన్ నది యొక్క ఓవర్ఫ్లో విభాగాన్ని సందర్శించి తాజా పరిస్థితిని సమీక్షించారు. వరద నీటి ఆకస్మిక ప్రవాహం నియంత్రణకు పొంగిపొర్లుతున్న నదీ తీర ప్రాంతాల్లో ఇసుక సంచులను వ్యూహాత్మకంగా పేర్చుతున్నారు. క్షేత్ర స్థాయిలో అధికారులు పరిస్థితిపై నిఘా ఉంచి అవసరమైనచోట తక్షణ నివారణ చర్యలు తీసుకోవాలని విభాగం ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలో వారం పాటు భారీ వానలు
భువనేశ్వర్: రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరిక జారీ చేసింది. రాగల 7 రోజుల పాటు ఈ వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ సమాచారం. ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉరుములతో కూడిన వర్షాలు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున రాబోయే 3 రోజుల పాటు పలు జిల్లాలకు పసుపు హెచ్చరిక జారీ చేసింది. ఈ హెచ్చరిక తీర ప్రాంతం, మారు మూల జిల్లాలైన బాలాసోర్, భద్రక్, జాజ్పూర్, కేంద్రాపడా, జగత్సింగ్పూర్, కటక్, కెందుఝొర్, మయూర్భంజ్, పూరీ, ఖోర్ధా, నయగఢ్, గంజాం, గజపతి జిల్లాలకు వర్తిస్తుంది. ఈ హెచ్చరిక కలహండి, నవరంగ్పూర్, రాయగడ, కొరాపుట్, మల్కన్గిరి, అంగుల్, ఢెంకనాల్, బౌధ్, కంధమల్ వంటి అదనపు జిల్లాలు కూడా ఈ ఉరుములతో కూడిన వర్షాల హెచ్చరిక పరిధిలోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఆగస్టు 2, 3 తేదీల్లో కెందుఝొర్, మయూర్భంజ్లలో భారీ వర్షాలు కురుస్తాయని, ఆగస్టు 3, 4 తేదీల్లో కలహండి, నవరంగ్పూర్, రాయగడ, గజపతిలకు విస్తరిస్తాయని అంచనా.
భారీ వర్ష హెచ్చరిక ఆగస్టు 4, 5 తేదీలలో కంధమల్, కొరాపుట్లకు విస్తరించి, ఆగస్టు 5, 6 తేదీలలో నవరంగ్పూర్, రాయగడ, కొరాపుట్లకే పరిమితం అయ్యే అవకాశం ఉంది. రాబోయే 3 రోజులలో మొత్తం వాతావరణంలో పెద్దగా మార్పు ఉండదని ఐఎండీ సూచించింది. ఐఎండీ సమాచారం ప్రకారం మధ్య ఛత్తీస్గఢ్, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర అంతర్గత ఒడిశాపై ఏర్పడిన తీవ్ర అల్ప పీడనం పశ్చిమ దిశగా కదిలి పశ్చిమ, మధ్య ఛత్తీస్గఢ్, దాన్ని ఆనుకుని ఉన్న విదర్భ, ఆగ్నేయ మధ్యప్రదేశ్ ప్రాంతాల్లోకి ప్రవేశించింది. ఈ వ్యవస్థ పశ్చిమ దిశగా తన కదలికను కొనసాగిస్తూనే రాబోయే 12 గంటల్లో అల్ప పీడనంగా బలహీనపడే అవకాశం ఉంది. మరో వైపు అనుకూలమైన రుతుపవన పరిస్థితులు ఒడిశా అంతటా విస్తారంగా వర్షాలు కురిపించేందుకు దోహదపడతాయని అంచనా. దక్షిణ ఒడిశా తీరం మరియు పరిసర ప్రాంతాల్లో శుక్ర వారం వరకు సముద్రంలోకి వెళ్లవద్దని ఐఎండీ మత్స్యకారులకు సూచించింది.
5 జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు
భువనేశ్వర్: రాష్ట్రంలో వరద తీవ్రత నేపథ్యంలో ఖుర్దా, భద్రక్, జాజ్పూర్, నబరంగ్పూర్, కలహండి జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఖుర్దా జిల్లా మినహా ఇతర జిల్లాల్లో గురువారం మాత్రమే సెలవు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను మూసివేయాలని ఆదేశించారు. వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని స్థానిక పాలనా యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుంది.
ఖుర్దా జిల్లాలో...
ఖుర్దా జిల్లాలోని అన్ని పాఠశాలల మూసివేతకు ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లా యంత్రాంగం గురువారం, శుక్రవారాల్లో ఖుర్దా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ సహాయక, ప్రైవేట్ పాఠశాలలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో సంభవించే వరదల దృష్ట్యా పాఠశాలలను మూసివేయాలని కలెక్టర్ అమృత్ రుతురాజ్ ఈ ఆదేశాలు జారీ చేశారు. అయితే పాఠశాలలోని ఉపాధ్యాయులు, సిబ్బంది అందరూ అనుక్షణం అందుబాటులో ఉండాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. జిల్లాలో వరదల సంభవించే ముందస్తు వాతావరణ సమాచారం నేపథ్యంలో విపత్తు నిర్వహణలో భాగంగా పాఠశాల భవనం, అనుబంధ సౌకర్యాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. పాఠశాలలను 24 గంటలూ తెరిచి ఉంచడానికి రోస్టర్ డ్యూటీని అమలు చేయాలని ప్రిన్సిపాల్లు, ప్రధాన ఉపాధ్యాయులకు సూచించారు. ఈ ఉత్తర్వులు తక్షణమే కచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. దీనితో పాటు జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులందరి సెలవులను రానున్న 4 రోజుల పాటు రద్దు చేసినట్లు స్పష్టం చేశారు.
మల్కన్గిరిలో సర్పై సమీక్ష
కొనసాగుతున్న కుండపోత వర్షం
భువనేశ్వర్ సంబల్పూర్ జిల్లా రెఢాఖోల్ బొడొమాల్ ప్రాంతంలో చెమిఠి కాలువపై ఉన్న వంతెన గురువారం కూలిపోయింది. దీంతో బొడొమాల్ మీదుగా సోన్పూర్, సంబల్పూర్ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హరిహర్, సురుబలి కాలువల్లో నీటి మట్టం పెరుగుతోంది.


