భువనేశ్వర్: భారీ వర్షాల కారణంగా కెందుఝొర్ జిల్లా జోడా మండలం బసుదేవ్పూర్ గ్రామంలోని కాన్పూర్ నీటి పారుదల ప్రాజెక్టు వద్ద ఉన్న కాఫర్ డ్యామ్కు గండి పడింది. దీంతో బైతరణి నది వెంబడి దిగువ ప్రాంతాల్లో హెచ్చరిక జారీ అయింది. నిర్మాణంలో ఉన్న కాన్పూర్ ప్రధాన నీటి పారుదల ప్రాజెక్టుకు చెందిన తాత్కాలిక మట్టి కాఫర్ డ్యామ్ గురువారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో కూలిపోవడంతో ఈ సంఘటన జరిగింది. ఫలితంగా ప్రధాన డ్యామ్కు చెందిన 6 రేడియల్ గేట్లు మరియు 2 డిప్రెషన్ స్లూయిస్ గేట్లను తెరిచారు. ఆనకట్ట పరిసర ప్రాంతాల్లో తక్షణమే హెచ్చరిక సైరన్లు మోగించి ప్రజలను ఆ ప్రాంతానికి దూరంగా ఉండమని సూచించారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు పోలీసులు, స్థానిక పరిపాలనా సిబ్బందిని ఘటనా స్థలంలో మోహరించారు. వరద నీటిని విడుదల చేయడంతో బైతరణి నది దిగువ ప్రాంతాల్లో వరద ముప్పు తలెత్తింది. జోడా, చంపువా, పట్నా, ఝుంపురా మండలాల్లో లోతట్టు గ్రామాలు, నదీ తీర ప్రాంతాల నివాసితులు నది తీరానికి సమీపించకుండా ఉండాలని జిల్లా యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. పెరిగిన నీటి ప్రవాహం కారణంగా ఆనంద్పూర్, అఖువాపొడాలో నీటి మట్టాలు పెరుగుతాయని భావిస్తున్నారు.


