రాయగడ: జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) పాఠ్యపుస్తకాలలొ చోటు చేసుకున్న తప్పిదాలు, నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారంపై బీజేడీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జగన్నాధ సరక నేతృత్వంలో జిల్లా కేంద్రంలో భారీ ఆందోళన చేపట్టింది. స్థానిక కపిలాస్ కూడలి నుంచి ఆ పార్టీ కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఊరేగింపుగా నిర్వహించి కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. ర్యాలీలో బీజేడీ కార్యకర్తలు, నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద సుమారు గంట సమయం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పాఠ్య పుస్తకాల్లో జాల్ముడి, నిముడ వంటివి చోటు చేసుకోవడం విద్యార్థుల భవిష్యత్పై తీవ్ర ప్రభావం పడుతుందని జగన్నాధ సరక అన్నారు. సుమారు రెండు వేలకుపైగా తప్పులు వెలుగు చూడటం అత్యంత బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతపెద్ద ఎత్తున తప్పిదాలు ఎలా జరిగాయో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ అనిశ్చితిలో పడిందని అన్నారు. ఈ కేసులో బాధ్యులపై ఇప్పటివరకు కఠిన చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు. నిరసన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నిత్యానంద గోండో, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝిల దిష్టిబొమ్మలను దహనం చేసిన బీజేడీ నాయకులు విద్యావ్యవస్థను గందరగోళానికి గురిచేసిన బాధ్యతను స్వీకరిస్తు ఇద్దరు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ నవీన్ చంద్రనాయక్కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఆందోళన కార్యక్రమంలో బీజేడీ సీనియర్ నాయకుడు సుధీర్ దాస్, పృథ్వీరాజ్ సాహు, పట్నాన గౌరీశంకర్, బినాయక్ పోలాయ్, దేశాశీష్ ఖడంగ, జగదీష్ పాత్రో, గుణుపూర్ శాసనసభ నియోకజవర్గం మాజీ ఎమ్మెల్యే రఘునాథ్ గోమాంగో తదితర ప్రముఖులు పాల్గొన్నారు.


