విద్యాశాఖపై.. పరాయి పెత్తనం!
కలెక్టర్ స్థాయిలో..
హక్కులను కాలరాయడమే..
రాష్ట్ర విద్యాశాఖ అధికారు లు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు ఉపసంహరించుకోకుంటే ఆందోళన చేప డతాం. వందరోజుల ప్రణాళికలోనే లోపభూయిష్టమైన నిర్ణయాలు ఉన్నాయి. ఇది వెనుకబడి ఉన్న విద్యార్థులకు ఎంతో నష్టాన్ని చేకూరుస్తుంది.
– పేడాడ కృష్ణారావు, డీటీఎఫ్ జిల్లా కార్యదర్శి
శ్రీకాకుళం :
రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి ఉత్తీర్ణతలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు అమలు చేస్తున్న 100 రోజుల ప్రణాళిక పట్ల సర్వత్రా ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు అనాలోచిత నిర్ణయాలతో విద్యాశాఖలో గందరగోళం నెలకొంటోందని విద్యాశాఖ వర్గాలు విమర్శిస్తున్నాయి. వందరోజుల ప్రణాళిక లోపభూయిష్టంగా, విద్యార్థులకు నష్టం కలిగించేలా రూపకల్పన చేయగా, ఇప్పుడు ఉపాధ్యాయులకు సైతం ఇది ఇబ్బంది పెట్టేలా నిర్ణయం తీసుకున్నారు. 100 రోజుల ప్రణాళిక పర్యవేక్షణకు ఇతర శాఖల అధికారులను నియమించడాన్ని ఉపాధ్యాయులు తప్పుపడుతున్నారు. ప్రతి మండలానికి రెవెన్యూ, వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్, ఎంపీడీవో, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపాలిటీ, వ్యవసాయం, హౌసింగ్, ఇరిగేషన్, పశుసంవర్ధక శాఖ తోపాటు మరికొన్ని శాఖల అధికారులను పర్యవేక్షకులుగా నియమించాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా అధికారులకు ప్రతిపాదనలు పంపించి వారి ఆమోదంతో పర్యవేక్షకులను నియమించాలని సూచించారు.
ఇదేం తీరు..
పర్యవేక్షకులు వారికి ఇష్టం వచ్చినప్పుడు ఆయా మండల పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్లి పదో తరగతి విద్యార్థులకు అమలు చేస్తున్న ప్రణాళికను పరిశీలిస్తారు. స్లిప్ టెస్ట్లు, పేపర్ల దిద్దుబాటు, మార్కులు సక్రమంగా వేశారా లేదా అన్న విషయాలతో పాటు ఉపాధ్యాయుల హాజరు పరిశీలిస్తారు. పర్యవేక్షకులు ఎప్పుడూ పరిశీలనకు వచ్చినా వారు అడిగిన తేదీకి సంబంధించిన పరీక్ష పేపర్లను వారి ముందు ఉంచాలి. ఉపాధ్యాయులు చేపట్టిన షైనింగ్, రైసింగ్ స్టార్ల విభజన తెలియజేయాలి. సెలవు దినాల్లో సైతం తరగతులు నిర్వహిస్తున్నారా లేదా అన్నది కూడా పర్యవేక్షకులు తనిఖీ చేస్తుంటారు. ఇందులో ఏమాత్రం తేడాలు గుర్తించినా సదరు ఉపాధ్యాయులపై చర్యలు తప్పవు. అయితే, పేపర్ల దిద్దుబాటు, బోధన ఇతర విషయాలపై ఇతర శాఖలకు అంతగా పట్టు ఉండదని, ఈ లెక్కన ఏదైనా ఉపాధ్యాయునిపై ఫిర్యాదు చేస్తే తాము నష్టపోవాల్సి వస్తుందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హక్కులు హరించడమే..
100 రోజులు పాటు ఉపాధ్యాయులకు సెలవు పెట్టే అవకాశం కూడా లేకుండా చేయడం హక్కులను కాలరాయడమేనని విద్యాసంఘాల నేతలు భగ్గుమంటున్నారు. ఏ కారణం చేతైనా సదరు ఉపాధ్యాయుడు పరీక్ష నిర్వహించకపోయినా, మార్కులు నమోదు చేయకపోయినా రాష్ట్రస్థాయిలో కమిషనర్ ఎదుట సంజాయిషీ ఉంచుకోవాల్సి ఉంటుందని హెచ్చరించడాన్ని తప్పుపడుతున్నారు. హైస్కూళ్లలో ఉపాధ్యాయునికి పర్యవేక్షణాధికారిగా ప్రధానోపాధ్యాయుడు, ఉప విద్యాశాఖాధికారి, ఆపైన జిల్లా విద్యాశాఖ అధికారి, వీరందరికీ సూపర్ బాస్ కలెక్టర్ ఉండగా.. రాష్ట్రస్థాయికి వచ్చి సమాధానాలు చెప్పాలని, అక్కడ సంతప్తి చెందకపోతే కఠిన చర్య లు తీసుకుంటామని హెచ్చరించడంపై ఆందోళన చెందుతున్నారు. ఈ నిర్ణయాలు మార్చుకోకుంటే ఉద్యమం తప్పదంటూ సంఘ నాయకులు స్పష్టం చేస్తున్నారు.
ప్రతి మండలానికి పర్యవేక్షకులను నియమించాలని రాష్ట్ర అధికారులు వెబ్ సమావేశంలో సూచించారు. జిల్లా కలెక్టర్ స్థాయిలో ఈ నియామకాలు జరుగుతాయి. శతశాతం ఉత్తీర్ణత సాధించడం కోసమే రాష్ట్రస్థాయిలో నిర్ణయాలు తీసుకుంటున్నారు.
– ఏ.రవిబాబు, జిల్లా విద్యాశాఖాధికారి
ఉపాధ్యాయులకు సెలవు లేకుండా చేయడం వారి హక్కులను కాలరాయడ మే. చావుపుట్టుకలు, తీవ్ర అనారోగ్యం ఉన్నా ప్రత్యేక తరగతులకు హాజరు కావాల్సిందే అనడం సరి కాదు. ఇతర శాఖల అధికారులను పర్యవేక్షకులుగా నియమించి విద్యాశాఖ అధికారులను ఉత్సవమూర్తులను చేయడం మంచిది కాదు.
– బి.వెంకటేశ్వర్లు, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
విద్యాశాఖపై.. పరాయి పెత్తనం!
విద్యాశాఖపై.. పరాయి పెత్తనం!
విద్యాశాఖపై.. పరాయి పెత్తనం!


