కిన్నెర దినోత్సవం | - | Sakshi
Sakshi News home page

కిన్నెర దినోత్సవం

Apr 1 2025 11:03 AM | Updated on Apr 1 2025 1:31 PM

ఘనంగా అంతర్జాతీయ ..

కొరాపుట్‌:

అంతర్జాతీయ కిన్నెర దినోత్సవాన్ని నబరంగపూర్‌, కొరాపుట్‌ జిల్లాల్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. నబరంగ్‌పూర్‌ జిల్లా కేంద్రంలోని శక్తి పీఠం నుంచి కిన్నెరలు పూర్ణ కుంభంతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ బస్టాండ్‌ సమీపంలోని వినాయక్‌ భవన్‌ వరకు సాగింది. అక్కడ జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌ డాక్టర్‌ శుభంకర్‌ మహాపాత్రో మాట్లాడుతూ కిన్నెరలు సామాజిక, ఆర్థిక, ఉపాధి రంగాలలో స్వయం శక్తి సాధించడానికి ప్రభుత్వం తోడ్పాటు ఇస్తుందన్నారు. ఈ సందర్భంగా వారికి కుట్టు మిషన్లు, వంట పాత్రలు, గ్యాస్‌ సిలెండర్లు, కుర్చీలు, టేబుళ్లను కలెక్టర్‌ ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో కిన్నెర సంఘం అధ్యక్షుడు మనోజ్‌ పట్నాయక్‌, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖా అధికారి సుధాంశు పాత్రో, డీఐపీఆర్‌ఓ మనోజ్‌ బెహరా, కౌన్సిలర్‌ షర్మిష్టా దేవ్‌, ఎ.ధనుంజయ్‌ రావు, కిన్నెర సంఘం తరఫున కాజల్‌ కిన్నెర, చుమ్కి కిన్నెర, ప్రీతి కిన్నెర తదితరులు పాల్గొన్నారు. మరో వైపు కొరాపుట్‌ జిల్లా కేంద్రం లో ప్రపంచ కిన్నెర దినోత్సవం ఘనంగా జరిగింది. స్కిల్‌ డవలప్‌మెంట్‌ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 114 మంది కిన్నెరలను గుర్తించినట్లు అధికారులు ప్రకటించారు. వారికి ప్రభుత్వం తరఫున సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

పర్లాకిమిడి: ట్రాన్స్‌జెండర్లపై సమాజంలో చిన్నచూపు ఉందని, తమకు రేషన్‌ కార్డుల ద్వారా 35 కిలోల బియ్యం సరఫరా చేయాలని, అంత్యోదయ పథకం కింద ఇళ్లు మంజూరు చేయాలని గజపతి జిల్లా కిన్నెరుల పునరావాస సంఘం కార్యదర్శి జాస్మిన్‌ షేక్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం హాలులో జరిగిన అంతర్జాతీయ కిన్నెర దినోత్సవంలో గౌరవ అతిథిగా జాస్మిన్‌ షేక్‌ పాల్గొన్నారు. ఈ వర్క్‌షాపును జిల్లా సామాజిక సురక్షా, దివ్యాంగుల స్వశక్తీకరణ విభాగం అధికారి సంతోష్‌ కుమార్‌ నాయక్‌ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సబ్‌ కలెక్టర్‌ అనుప్‌ పండా, ట్రాన్స్‌జెండర్స్‌ అధ్యక్షురాలు మధు బోరాడో, నువాగడ బీడీఓ లోకనాథ శోబోరో, లక్ష్మకుమార్‌ ముర్ము, ఈఓ పురపాలక సంఘం, స్వాస్‌ స్వచ్ఛంద సంస్థ మేనేజరు పి.సునీత తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఇప్పటివరకూ 90 మంది కిన్నెరులు ఉన్నారని, వారు సమాజంలో మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురవుతున్నారని, వారికి సరైన రక్షణ ఇవ్వాలని, వారికి ఆశ్రయం కల్పించి అంత్యోదయ పథకం కింద ఇళ్లు మంజూరు చేయాలని ట్రాన్స్‌జెండర్స్‌ కార్యదర్శి జాస్మిన్‌ షేక్‌ కోరారు. కొందరు కిన్నెరులు బలవంతంగా అత్యాచారాలకు గురవుతున్నారని అటువంటి వారికి ట్రాన్స్‌జెండర్స్‌ ప్రొటెక్షన్‌ చట్టం కింద పోలీసులు రక్షణ కల్పించాలని అన్నారు. పర్లాకిమిడిలో 79 మంది కిన్నెరులలో 45మందికి ఐడెంటిటీ కార్డులు మంజూరు చేశామని, 19 మందికి పింఛన్లు, ముగ్గురికి లక్షరూపాయలు చొప్పున్న స్వయం ఉపాధి పథకం కింద క్యాంటీన్లు మంజూరు చేశామని డి.యస్‌.యస్‌.ఓ. సంతోష్‌ కుమార్‌ నాయక్‌ తెలియజేశారు. కార్యక్రమంలో కిన్నెరుల సంఘం సభ్యురాలు క్రాంతి బెహారా కర్మశాలకు విచ్చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు.

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం నుంచి జెడ్పీ కార్యాలయం వరకు సోమవారం అంతర్జాతీయ తృతీయ లింగ దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. 90 మంది కిన్నెరలు పాల్గొన్నారు. అనంతరం జిల్లా పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ఓ వర్క్‌షాప్‌ నిర్వహించారు. సమాజ సేవ చేస్తున్న కిన్నెరులను గుర్తించి సత్కరించారు.

కిన్నెర దినోత్సవం 1
1/4

కిన్నెర దినోత్సవం

కిన్నెర దినోత్సవం 2
2/4

కిన్నెర దినోత్సవం

కిన్నెర దినోత్సవం 3
3/4

కిన్నెర దినోత్సవం

కిన్నెర దినోత్సవం 4
4/4

కిన్నెర దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement