మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): రానున్న రోజుల్లో ఏఐ హ్యూమనాయిడ్ రోబోలను విరివిగా ఉపయోగిస్తారని ఎడుబాటిక్స్ సంస్థ బిజినెస్ మేనేజర్ కె.సందీప్ పేర్కొన్నారు. స్థానిక మొగల్రాజపురంలోని పీబీ సిద్ధార్థ కళాశాల వెబ్నార్ హాలులో కళాశాల ఎలక్ట్రానిక్స్ అండ్ ఏఐ విభాగాలు సంయుక్తంగా ఏఐ హ్యూమనాయిడ్ రోబోటిక్స్పై మంగళవారం వర్క్షాప్ నిర్వహించాయి. సందీప్ రీసోర్స్ పర్సన్గా హాజరై ప్రసించారు. భవిష్యత్లో రోబోల వినియోగం ఎక్కువగా ఉంటుందన్నారు. కొరియా, జపాన్, చైనా దేశాల్లో ఇప్పటికే రోబోలను విరివిగా వినియోగిస్తున్నారని వివరించారు.
యువత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్ కోర్సులపై ఆసక్తి పెంచుకుని, నైపుణ్యం సాధించాలని సూచించారు. కళాశాల ఎలక్ట్రానిక్స్ విభాగాధిపతి కె. సాంబశివరావు మాట్లాడుతూ.. రోబోల పని తీరుపై విద్యార్థులకు స్వయంగా అవగాహన కల్పించేందుకు ఈ వర్క్షాప్ను నిర్వహిస్తున్నామన్నారు. కళాశాల ఏఐ విభాగాధిపతి ఉదయశ్రీ, కళాశాల డైరెక్టర్ వేమూరి బాబూరావు, డీన్ రాజేష్ సి.జంపాల, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మనోరంజని, అధ్యాపకులు డి.శ్రీనివాసరెడ్డి, జి.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


