ఎరుకోపాడు(తిరువూరురూరల్): చేపల ఉత్పత్తి పెంచేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. తిరువూరు మండలం ఎరుకోపాడులో ఫిష్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్, మత్స్యకార సహకార సంఘం చేపట్టిన క్యాప్టివ్ ఫీడ్ నర్సరీ చెరువులో చేపల పెంపకాన్ని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ బుధవారం ప్రారంభించారు. 30 లక్షల చిరు చేపపిల్లలను నీటిలోకి వదలిన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1.13 కోట్ల చేప పిల్లల ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించామన్నారు. 10 శాతం మనుగడ రేట్ ఆధారంగా లక్ష్యాన్ని చేరుకునేందుకు సుమారు 11 కోట్ల చేప స్పాన్ను నిల్వ చేయాల్సి ఉందని వివరించారు. ఈ కార్యక్రమంతో జిల్లా స్థూల దేశీయోత్పత్తి, స్థూల విలువ జోడింపు వృద్ధి చెందడంతో పాటు మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నారు. జిల్లా మత్స్య అధికారి సౌభాగ్య చక్రాణి, ఎఫ్డీఓ బి. తేజస్వి, తిరువూరు తహసీల్దార్ చంద్రమౌళి, ఎంపీడీఓ రవిబాబు, మత్స్యకారుల సంఘ సభ్యులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ


