వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అరెస్ట్ను వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ బుధవారం ఒక ప్రకటనలో ఖండించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులను రాజకీయంగా వేధించేందుకు కూటమి ప్రభుత్వం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. చట్టం తన పని తాను చేసుకోవాల్సిన సందర్భంలో రాజకీయ కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేయడం, అరెస్టులు చేయడం ద్వారా ప్రజల దృష్టిని ప్రభుత్వ వైఫల్యాల నుంచి మళ్లించే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని పేర్కొన్నారు. ప్రతిపక్ష గొంతును అణచి వేయాలనే ప్రయత్నాలు ఎంత చేసినా వైఎస్సార్ సీపీ ప్రజల తరఫున పోరాటాన్ని కొనసాగిస్తుందని, ఇలాంటి రాజకీయ కక్ష సాధింపు చర్యలను ప్రజలు గమనిస్తున్నారని దేవినేని అవినాష్ అన్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై తీసుకున్న చర్యలను ప్రభుత్వం వెనక్కి తీసుకుని, రాజకీయ వేధింపులకు స్వస్తి పలకాలని ఆయన డిమాండ్ చేశారు.


