శుభకార్యం వద్ద ఇరు వర్గాల మధ్య తలెత్తిన వివాదం టీడీపీ నాయకులు మూకుమ్మడిగా వెళ్లి వైఎస్సార్ సీపీ కుటుంబంపై దాడి
సబ్జపాడు(మైలవరం): గ్రామంలో జరిగిన ఒక శుభకార్యం వద్ద ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన వివాదంలో టీడీపీ నాయకులు మూకుమ్మడిగా వెళ్లి వైఎస్సార్ సీపీ కార్యకర్తల కుటుంబంపై దాడి చేశారు. ఈ దాడిలో నలుగురికి గాయాలయ్యాయి. వివరా ల్లోకి వెళ్తే... మైలవరం మండలం చండ్రగూడెం శివారు సబ్జపాడు గ్రామంలో సోమవారం ఉదయం ఒక శుభకార్యం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన వైఎస్సార్ సీపీ కార్యకర్త నిమ్మకూరు రాజేష్కు, టీడీపీ నాయకుడు బండారు నాగరాజుకు మధ్య వివాదం జరిగింది. ఇద్దరి మధ్య తోపులాట జరగ్గా గ్రామస్తులు సర్దిచెప్పి పంపారు. ఆ తర్వాత మధ్యాహ్నం బండారు నాగరాజు మరో టీడీపీ నాయకుడు తాళ్లూరు రమేష్, తాళ్లూరు మధు, తాళ్లూరు నరేంద్ర, బండారు జయరాజు, బండారు కోటేసులతో కలిసి వైఎస్సార్ సీపీ కార్యకర్త నిమ్మకూరు రాజేష్ కుటుంబంపై దాడి చేశారు. ఈ దాడిలో రాజేష్తో పాటు నిమ్మకూరు రోస్కిరణ్, నిమ్మకూరు వినోద్కుమార్, నిమ్మకూరు మౌనికకు గాయాలయ్యాయి. స్థానికులు వారిని మైలవరం ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుల స్టేట్మెంట్ను రికార్డు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితులు వినోద్కుమార్, మౌనిక మాట్లాడుతూ దాడి చేసిన వ్యక్తులు మైలవరం పోలీసుస్టేషన్ వద్ద కూడా తమపై దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతోనే రాళ్లు, కర్రలతో తమపై దాడికి తెగబడ్డారన్నారు. ప్రభుత్వం తమదేనన్న అహంకారంతోనే మహిళ అని కూడా చూడకుండా అసభ్యంగా తాకుతూ దాడి చేశారని వాపోయారు. ఇదిలా ఉండగా దాడి చేసిన టీడీపీ నాయకులు కూడా బాధితులపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పోలీసులు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు.


