మహబూబాబాద్: ఉన్నత చదువులు.. ఉద్యోగాల పేరిట విదేశాలకు వెళ్తున్న భారతీయులు.. అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా.. అమెరికాలో ఘోర ప్రమాదంలో భారతీయ విద్యార్థినిలు మృతి చెందారు. కాలిఫోర్నియాలో జరిగిన కారు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు దుర్మరణం పాలయ్యారు.
తెలంగాణ మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన పులఖండం మేఘనారాణి (25), ముల్కనూరుకు చెందిన కడియాల భావన (24) మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. అక్కడ ఎమ్మెస్ పూర్తిచేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం మేఘన, భావన సహా మొత్తం 8 మంది స్నేహితులు రెండు కార్లలో కాలిఫోర్నియాలో టూర్కి బయల్దేరారు. ఈ క్రమంలో..
అలబామా హిల్స్ రోడ్డులో మలుపు వద్ద మేఘన, భావన ప్రయాణిస్తున్న కారు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు.. ఇటు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఈ ఇద్దరి మృతితో గార్ల మండలంలోని వాళ్ల స్వగ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మేఘన తండ్రి నాగేశ్వరరావు గార్ల మీసేవా సెంటర్ నిర్వహకుడు కాగా.. భావన ముల్కనూర్ ఉపసర్పంచ్ కోటేశ్వర్రావు కుమార్తె అని తెలుస్తోంది. ఉన్నత చదువుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో, యువతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తమ బిడ్డల మృతదేహాలను రప్పించేందుకు ప్రభుత్వం సాయం చేయాలని ఆ కుటుంబాలు వేడుకుంటున్నాయి.
అమెరికాలో రోడ్డు ప్రమాదం మహబూబాబాద్ యువతులు మృతి
అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా గార్ల మీసేవ కేంద్రం నిర్వాహకుడు నాగేశ్వరరావు కూతురు మేఘన, ముల్కనుర్ ఉప సర్పంచ్ కోటేశ్వరరావు కూతురు భావన మృతి
ఉన్నత చదువుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి… pic.twitter.com/rnCljzTWtP— Telugu Scribe (@TeluguScribe) December 29, 2025


