● నెలలో 7.096 టీఎంసీల చేరిక
నిజాంసాగర్: ఉమ్మడి జిల్లా వరప్రదాయిని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో కొనసాగుతోంది. బుధవారం ఎగువ ప్రాంతాల నుంచి 2,450 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టులోకి గతనెల 27న ఇన్ఫ్లో ప్రారంభమైంది. అప్పటినుంచి రోజూ ఎంతోకొంత నీరు వచ్చి చేరుతూనే ఉంది. నెలరోజుల్లో 7.096 టీఎంసీల ఇన్ఫ్లో వచ్చిందని అధికారులు తెలిపారు. ఎగువన కురిసిన వర్షాలతోపాటు పోచారం ప్రాజెక్టు, ఘనపురం ఆనకట్ట, హల్దీవాగుల వరద వస్తోందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. బుధవారం సాయంత్రానికి 1,401.48 మీటర్ల (13.051 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని తెలిపారు.
వేల్పూర్(మెండోరా): శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో తగ్గిపోవడంతో నీటిమట్టం నిలకడగా ఉంటోంది. ప్రస్తుతం 963 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా.. అంతే మొత్తంలో అవుట్ ఫ్లో ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 80.5 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 44.713 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాకతీయ కాలువ ద్వారా 250 క్యూసెక్కులు, మిషన్ భగీరథ పథకానికి 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా.. ఆవిరిరూపంలో 482 క్యూసెక్కుల నీరు వెళ్తోందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు.
నిలకడగా ఎస్సారెస్పీ నీటిమట్టం


