సుభాష్నగర్: తిరంగా ర్యాలీతో జిల్లా ప్రజల గుండె నిండా దేశభక్తి ఉప్పొంగిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని ఆర్ఆర్ చౌరస్తా నుంచి గాంధీచౌక్ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంతో దేశభక్తి పెంపొందడమే కాకుండా స్వాతంత్ర సమరయోధుల చరిత్ర తెలిసే అవకాశం ఉంటుందన్నారు. తిరంగా ర్యాలీ అంటే చేతిలో జెండా పట్టుకొని నడవడం మాత్రమే కాదని, ప్రతిఒక్కరి హృదయంలో దేశభక్తి, మన ఆలోచనల్లో జాతీయత, చేతల్లో దేశ నిర్మాణాన్ని నింపుకోవడం అన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి మాట్లాడుతూ యువత స్వాతంత్ర సమరయోధుల పాఠ్యాంశాలను చదవాలని పేర్కొన్నారు. చిన్న వయస్సులో దేశం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్, ఉద్దం సింగ్, ఆజాద్ చంద్రశేఖర్, అబ్దుల్ కలాం తదితరుల చరిత్రను తెలుసుకోవాలన్నారు. తిరంగా ర్యాలీ ఆద్యంతరం హుషారుగా కొనసాగింది. ర్యాలీలో 150 మీటర్ల త్రివర్ణపతాకం ఆకట్టుకుంది. కార్యక్రమంలో జాతీయ పసుపుబోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి, రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, బీజేపీ ఫ్లోర్లీడర్ ప్రమోద్, సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మోర్చాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్ రెడ్డి
ఇందూరులో రెపరెపలాడిన
త్రివర్ణ పతాకం


