వేల్పూర్(మెండోరా): బాల్కొండ మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుపై పర్యాటకుల సందడి నెలకొంది. వరుసగా రెండవ శనివారం, ఆది, సోమవారం సెలవులు రావడంతో తల్లిదండ్రులు, పిల్లలు, పెద్దలు శ్రీరాంసాగర్కు వచ్చి ప్రాజెక్టు అందాలను తిలకించారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహం వల్ల ప్రాజెక్టు నీటిమట్టం సగం కంటే ఎక్కువగా పెరిగింది. జిల్లా వాసులే కాకుండా ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాలకు చెందిన పర్యాటకులు ప్రాజెక్టులోకి చేరిన నీటిని చూస్తూ ఆనందించారు. ప్రాజెక్టుపై ఉన్న గుర్రపు సవారీలు చిన్నారులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రాజెక్టుకు భారీగా పర్యాటకులు తరలి రావడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. డ్యామ్ దిగువ భాగానికి, ప్రమాదకర ప్రాంతాల వైపు వెళ్లకుండా మైకుల ద్వారా హెచ్చరించారు.


