బాన్సువాడ: పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో ఆదివారం ఉదయం జరిగిన కుక్కల దాడిలో సితార అనే చిన్నారికి తీవ్ర గాయలయ్యాయి. రోడ్డు–2లో అమ్మమ్మతో కలిసి చెత్త వేసేందుకు వెళ్లిన సితారపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ ఘటనలో సితార పెదవిపై తీవ్ర గాయలయ్యాయి. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సితార ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల కక్కుల బెడదను నివారించాలని బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. పలు కాలనీల్లో కుక్కలను పట్టి ఇతర ప్రాంతాలకు తరలించారు. ఇంకా చాలా కుక్కలు పట్టణంలో విహరిస్తూ చిన్నారులపై దాడులు చేస్తూనే ఉన్నాయి.
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
బాన్సువాడ: పట్టణంలోని జామా మజీద్ ఎదురుగా ఉన్న కాంప్లెక్స్లో ఆదివారం గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించినట్లు సీఐ శ్రీధర్ తెలిపారు. మృతుడి వయస్సు 45 ఏళ్ల వరకు ఉంటుందని, సుమారు 5 అడుగుల ఎత్తు, కోల ముఖం, నలుపు రంగు గడ్డం, గోధుమ రంగు ప్యాంటు వేసుకుని ఉన్నాడని అన్నారు. మృతుడు కొంత కాలంగా బాన్సువాడలో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నట్లు స్థానికుల ద్వారా తెలిసిందన్నారు. మృతుడి వివరాలు తెలిసిన 8712686167, 8712666243 నంబర్లను సంప్రదించాలని అన్నారు.


