● తలకు తీవ్రగాయాలు
డిచ్పల్లి: మండలంలోని బీబీపూర్ తండా శివారులో ఆదివారం రైలు నుంచి ప్రమాదవశాత్తు బాలుడు జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఏరియా తలాబ్ కట్టకు చెందిన బాలుడు నవీద్ తన కుటుంబసభ్యులతో కలిసి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలులో నాందేడ్కు బయలుదేరాడు. ఇందల్వాయి స్టేషన్ దాటిన తర్వాత మూత్ర విసర్జన కోసం టాయిలెట్కు వెళ్లి తిరిగి సీటు వద్దకు వస్తుండగా బీబీపూర్ శివారులో ప్రమాదవశాత్తు రైలు బోగీ డోర్ నుంచి కిందికి పడిపోయాడు. గమనించిన తోటి ప్రయాణికులు ఎవరో కింద పడిపోయాడని చెప్పుకోవడం విన్నప్పటికీ నవీద్ కుటుంబసభ్యులు ఇతరులెవరో ఉండవచ్చని భావించారు. ఇంతలోనే రైలు నిజామాబాద్కు రావడం.. నవీద్ కనిపించక పోవడంతో ఆందోళనకు గురైన వారు బీబీపూర్ శివారులో పడిపోయింది నవీద్ అయి ఉండవచ్చని భావించి వెంటనే రైల్వే పోలీసులను ఆశ్రయించారు. రైలు నుంచి కిందపడిన నవీద్ తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం అందించడంతో ఈఎంటీ రవి, పైలట్ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకొని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నవీద్ తలకు దెబ్బ తగిలిన చోట వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.


