● సీపీ సాయిచైతన్య
నిజామాబాద్ రూరల్: విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ దిశగా పయనించాలని సీపీ సాయిచైతన్య అన్నారు. నగరంలోని ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన 130 మంది విద్యార్థులకు ఒకొక్కరికి రూ. పది వేల చొప్పున అందించిన స్కాలర్షిప్లను సీపీ సాయిచైతన్య ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రతిభగల విద్యార్థులను ఉన్నత విద్య వైపు ప్రోత్స హించాలనే ఉద్దేశంతో ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. జీవితంలో విజయం సాధించాలంటే లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దానిని సాధించే వరకు నిరంతరం కష్టపడాలని సూచించారు. కార్యక్రమంలో చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకుడు శివారెడ్డి, ట్రస్ట్ కో–ఫౌండర్ శిరీష, ఎస్సై సాయన్న, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


