మోపాల్: అటవీ ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని ఎఫ్ఆర్వో రవి మోహన్ భట్ పేర్కొన్నారు. శనివారం మంచిప్ప అటవీ ప్రాంతంలో ఆయన పర్యటించారు. ఈ సందర్బంగా కాల్పోల్ వాటర్ ఫాల్స్ను పరిశీలించారు. వాటర్ ఫాల్స్ వద్ద ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని సూచించారు. నీటి కుంటలను కాపాడాలని తెలిపారు. అడవులను నరికితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట సెక్షన్ అధికారులు బాసిత్, సాయికుమార్, బీట్ ఆఫీసర్స్ ఉన్నారు.
బాన్సువాడ రూరల్: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ మహిళ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బాన్సువాడ పట్టణం టీచర్స్ కాలనీలో చోటు చేసుకుంది. సీఐ తుల శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన అంబిల్పూర్ రజిని(34) కొంత కాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. పలు ఆస్పత్రుల్లో చూయించినా నయం కాలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతురాలికి భర్త బాలరాజు, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


