కామారెడ్డి క్రైం: కామా రెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి విద్యుత్నగర్ కాలనీలో శనివారం భారీ చోరీ జరిగింది. గాంధారికి చెందిన పబ్బ సురేశ్ విద్యుత్ శాఖలో లైన్ ఇన్స్పెక్టర్గా, అతని భార్య లావణ్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తూ కామారెడ్డిలో నివాసం ఉంటున్నారు. శాఖాపరమైన శిక్షణకు హాజరయ్యేందుకు సురేశ్ మూడు రోజుల క్రితం వరంగల్ వెళ్లాడు. దీంతో అతని భార్యాపిల్లలు సమీప బంధువుల ఇంట్లో ఉన్నారు. శనివారం ఇంటికి వచ్చి చూసేసరికి దొంగలు పడినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంట్లో దాచిన 16 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.90 వేలు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. సీసీఎస్, క్లూస్టీం బృందాలు ఆధారాలు సేకరించారు.
గాంధారిలో ఒకరి అదృశ్యం
గాంధారి: మండల కేంద్రానికి చెందిన గాండ్ల నారాయణ(66) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు పోలీసులు శనివారం తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతను తిరిగి రాలేదు. కుటుంబీకులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వర్ని: మండలంలోని ఓ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న బాలిక శనివారం ఉదయం అదృశ్యమైంది. పాఠశాల అధికారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సదరు బాలిక బస్సులో హైదరాబాద్ వెళ్తున్న విషయాన్ని తెలుసుకొని కండక్టర్ ద్వారా మేడ్చల్ పోలీస్స్టేషన్లో ఆశ్రయం కల్పించారు. బాలిక తల్లిదండ్రులు పోలీస్స్టేషన్కు వెళ్లి ఇంటికి తీసుకొచ్చారు.
● 16 తులాల బంగారం, 30 తులాల
వెండి, రూ.90 వేలు అపహరణ


