● పోలీసులపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాలి
● బాసర జోన్ డీఐజీ భాస్కరన్
బోధన్టౌన్(బోధన్): ప్రజలకు పోలీస్ శాఖపై విశ్వాసం మరింత పెంచేలా, క్రమశిక్షణతో పారదర్శకంగా సేవలందించాలని బాసర జోన్ డీఐజీ భాస్కరన్ అన్నారు. పట్టణ పోలీస్ స్టేషన్ ఆయన శనివారం తనిఖీ చేశారు. స్టేషన్లోని అన్ని విభాగాలతో పాటు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బంది హాజరు రిజిస్టర్తోపాటు ఎవరెవరు ఏ డ్యూటీ చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లో నమోదైన, పరిష్కరించిన, పెండింగ్లో ఉన్న కేసుల రికార్డులను పరిశీలించారు. సీఐ వెంకట నారాయణ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భాస్కరన్ మాట్లాడుతూ.. స్టేషన్కు వచ్చే వృద్ధులు, మహిళలు, అత్యవసర సాయం కోసం వచ్చే వారితో స్నేహపూర్వకంగా మాట్లాడి సమస్యను తెలుసుకోవాలన్నారు. ముఖ్యంగా సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని, కళాశాలలు, పాఠశాలల్లో సైబర్ నేరాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ప్రధాన కూడళ్లలో ట్రాపిక్ ఎన్ఫోర్స్మెంట్ను ఏర్పాటు చేయాలని సూచించారు. కేసుల దర్యాప్తులో నూతన టెక్నాలజీని ఉపయోగించాలని, పట్టణంలోని ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పర్యవేక్షించాలన్నారు. మహారాష్ట్ర సరిహద్దులోని అన్ని ప్రధాన రహదారులపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలన్నారు. డీఐజీ వెంట సీపీ సాయి చైతన్య, అడిషనల్ డీసీపీ శుభం ప్రకాష్, ఏసీపీ శ్రీనివాస్, ఎస్సై హబీబ్ఖాన్, ట్రాపిక్ ఎస్సై మహేశ్ ఉన్నారు.


