● దరఖాస్తులకు విడుదలైన
మార్గదర్శకాలు
డొంకేశ్వర్(ఆర్మూర్): కొత్త పింఛన్ల మంజూరుపై రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు మార్గదర్శకాలతోపాటు దరఖాస్తు ఫారం మోడల్ను శుక్రవారం విడుదల చేసింది. దీంతో జిల్లాలో ఆశగా ఎదురుచూస్తున్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, కల్లుగీత, చేనేత కార్మికులతోపాటు ఫైలేరియా, డయాలసిస్ బాధితులు దరఖాస్తు చేసుకోచ్చని ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలలో ఉన్నాయి. అయితే, బీడీ కార్మికులు, వృద్ధుల విషయాన్ని అందులో తెలుపలేదు. దీంతో వారు దరఖాస్తు చేసుకోవచ్చో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఇటు నింపిన దరఖాస్తులను స్థానిక పంచాయతీ కార్యదర్శి సంతకాల అనంతరం ఎంపీడీవో కార్యాలయాల్లో అందజేయాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ఎంపీడీవోల పరిశీలన పూర్తయిన తర్వాత అర్హత ఉన్న దరఖాస్తులను ఆన్లైన్లో ఎంట్రీ చేయనున్నారు. ఆన్లైన్లో ఎంట్రీ అయిన డేటా ఆధారంగా ప్రభుత్వం కొత్త పింఛన్లను మంజూరు చేయనుంది.


