లింగంపేట: వాగులో గల్లంతైన శ్రీహరి మృతదేహం బుధవారం లభించింది. వివరాలిలా ఉన్నాయి. రాంపల్లి కొన తండాకు చెందిన దేవసోత్ శ్రీహరి సోమవారం రాత్రి పెద్దవాగులో గల్లంతైన విషయం తెలిసిందే. అతడి ఆచూకీ కోసం లింగంపేట ఎస్సై దీపక్కుమార్, ఎన్డీఆర్ఎఫ్ బృందం, ఎల్లారెడ్డి ఫైర్ సిబ్బంది గాలించారు. బుధవారం ఉదయం వరద ఉధృతి తగ్గడంతో చెక్డ్యామ్ వద్ద శ్రీహరి మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని ఒడ్డుకు తెచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
శ్రీహరిని వెంటాడిన వరద..
దేవసోత్ శ్రీహరి మరో ఇద్దరితో కలిసి 2022 ఆగస్టు 28న చేపలు పట్టడానికి పంట చేను వద్ద ఉన్న పెద్దవాగులోకి దిగాడు. భారీ వర్షం కురియడంతో వరద ఉధృతి పెరగడంతో వాగులో చిక్కుపోయారు. సుమారు ఎనిమిది గంటలపాటు బి క్కుబిక్కుమంటూ వరద ఉధృతిలో గడిపారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఐదు గంటలపాటు శ్రమించి ముగ్గురిని కాపాడారు. శ్రీహరి తాజాగా అదే వాగులో గల్లంతై మృతిచెందాడు. భార్య కమల, ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.


