కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలో సోమవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈక్రమంలో తెల్లవారుజామున కామారెడ్డి మండలంలోని గొల్లపల్లి నుంచి రంగంపేట గ్రామానికి వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు ఓ ప్రైవేట్ బస్సు 45 మంది ప్రయాణికులతో జిల్లా కేంద్రంగా గుండా బయలుదేరింది. రామారెడ్డి రోడ్డులోని సుభాష్ టాకీస్ సమీపంలోకి రాగానే బస్సు సైలెన్సర్లోకి నీళ్లు చేరి రోడ్డుపైనే ఆగిపోయింది. అప్పటికే రోడ్డుపై భారీగా నీటి ప్రవాహం ఉండడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందడంతో పట్టణ పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తాడు సహాయంతో ప్రయాణికులందర్నీ కొద్ది దూరంలోని సురక్షిత ప్రాంతానికి తరలించారు. మరో బస్సులో ఎక్కించి గమ్యస్థానానికి పంపించారు. దీంతో ప్రయాణికులందరూ ఊపిరిపీల్చుకున్నారు.
● రోప్ సాయంతో ప్రయాణికులను
సురక్షిత ప్రాంతానికి తరలించిన పోలీసులు


