● నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
● అదనపు కలెక్టర్ భుజంగరావు
సుభాష్నగర్: ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా పంపిణీ వ్యవస్థ (రేషన్ షాపుల) ద్వారా ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మూడు మాసాలకు సంబంధించిన రేషన్ కోటాను ఒకేసారి సజావుగా పంపిణీ చేయాలని అదనపు కలెక్టర్ భుజంగరావు డీలర్లకు తెలిపారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఆయా మండలాల రేషన్డీలర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 31లోపు రేషన్ పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. బియ్యం పంపిణీలో అవకతవకలు, అలసత్వానికి తావిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రేషన్ దుకాణాలకు సకాలంలో బియ్యం నిల్వలు చేరుకునేలా, కార్డుహోల్డర్లకు వారి కోటా మేరకు ఏకకాలంలో మూడు నెలల పంపిణీని పర్యవేక్షించాలని పౌరసరఫరాలశాఖ అధికారులను ఆదేశించారు. ఈ–పాస్ యంత్రాల్లో ఎక్కడైనా సాంకేతిక సమస్యలు ఏర్పడితే వెంటనే పరిష్కరించాలన్నారు.
ఈ–కేవైసీ తప్పక చేయించుకోవాలి..
రేషన్ కోటా కలిగిన ప్రతిఒక్కరూ ఈ–కేవైసీ చేసుకునేలా రేషన్ డీలర్లు చొరవ చూపాలని అదనపు కలెక్టర్ భుజంగరావు సూచించారు. ప్రభుత్వం నిర్ధేశించిన గడువు లోపు ఈ–కేవైసీ చేయించుకోకపోతే రేషన్ కోటా నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు. దీన్నిదృష్టిలో పెట్టుకుని రేషన్ కార్డు కలిగిన కుటుంబాల్లోని ప్రతి సభ్యుడు ఆగస్టు 15లోపు తప్పక ఈ–కేవైసీ చేసుకునేలా డీలర్లు కృషిచేయాలన్నారు. డీఎస్వో శ్రీకాంత్రెడ్డి, ఏఎస్వో అరవింద్రెడ్డి, డీటీ పవన్కుమార్, రేషన్డీలర్లు పాల్గొన్నారు.


